Traditional occupations | ‘సాకలి పొయ్యి కూలిపోయినది.. సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బాడిశె మొద్దువారినది’ అంటూ కదిలించే పాట రాశాడు కవి గోరటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సడుగులిరిగిన కులవృత్తులను కాపాడుకునేటందుకు నడుం బిగించారు.
పుట్టుక మొదలు ఆఖరి మజిలీ దాన్క కులవృత్తులు లేకుండా మనిషి మనలేడు. పురుడు పోసే మంత్రసాని నుంచి చితిని కాపాడే కాటికాపరి దాన్క మనిషికి మనిషితో సంబంధం అలాంటిది మరి. సాలింటి బట్ట, కుమ్మరింటి కుండ, కమ్మరింటి గొడ్డలి కామ, వడ్లింటి చెక్క.. ఇలా చేతివృత్తులు ఇతర వృత్తులతో సాలె గూడు వలె అల్లుకొని ఉంటాయి. మన తెలంగాణ సంప్రదాయంలో పల్లెటూరు మొదలు పట్నం దాన్క ఒకరికొకరు తోడు అన్నట్టుగా కలిసిమెలిసి ఉంటారు. కులభేదాలు లేకుండా బాపు, నాయిన, అన్న, అక్కా, తమ్మీ అని వావి వరుసలతో పిల్సుకుంటరు. అందుకే పరాయి పాలనలో ఆదరణ కోల్పోయిన కులవృత్తులు తెలంగాణ ఆవిర్భావంతో పురుడుపోసుకుంటున్నాయి.
ఇప్పుడు కొత్తగా కులవృత్తులను ఆధారం చేసుకొని జీవనం సాగించే వృత్తిపనివారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించి చేయూతనందించనున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నేడు ప్రారంభం కానున్నది. ఇప్పటికే పునరుజ్జీవం పోసుకున్న చేతివృత్తులకు ఈ కార్యక్రమం మరింత చేయూతను అందించనున్నది.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సంక్షేమ సంబురాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందివ్వనున్నారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీని కూడా లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంచిర్యాల వేదికగా ఈ రెండు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (శుక్రవారం) ప్రారంభిస్తారు. బీసీల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం రూపొందించింది. ఇటీవలే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్నది. ఇది నిరంతర ప్రక్రియ కాగా, అర్హులను ఎంపిక చేసి ప్రతి నెలా 15న లబ్ధిదారులకు చెక్కులను అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పథకం గ్రౌండింగ్లో ఆయా కులవృత్తులకు దోహదపడే పనిముట్లు, పరికరాలు కొనుకోవటానికి లబ్ధిదారులకు సహకరించటంతోపాటు రెండేండ్ల వరకూ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నది.
బీసీ కార్పొరేషన్కు రూ.100 కోట్ల నిధులు
వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి బీసీ కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.300 కోట్లను ప్రతిపాదించింది. మొదటి విడతగా రూ.100 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం బీసీ కులవృత్తిదారులకు, చేతివృత్తిదారులకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయంచిన నేపథ్యంలో అందుకు సంబంధించి నిధులను కూడా విడుదల చేసింది.