భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడితే, కడుపు పెట్టుకుని, కాపాడుకున్నది ఖమ్మం జిల్లా ప్రజలే అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఈ రోజు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పరిపాలన భవనాన్ని నిర్మించుకున్నాం. నూతన కలెక్టరేట్ను నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి ప్రజా కార్యక్రమాలు జరిగి, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కొత్తగూడెంకు కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ వచ్చింది. థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది. ఇల్లందులో సింగరేణికి తొలి పునాది రాయి పడితే కొత్తగూడెం నుంచి విస్తరించి, సింగరేణి సిరుల కల్పవల్లిగా నిలిచిన గడ్డ కొత్తగూడెం ఇంల్లందు గడ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు.
అద్భుతమైన చైతన్యం ఉన్న జిల్లా అని కేసీఆర్ తెలిపారు. కమ్యూనిస్టు విప్లవ భావాలతో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రగతి శీల కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమ సందర్భంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైల్లో పెడితే మీరే కాపాడుకున్నారు. మీ అందరి ఆశీర్వాద బలం, ఐక్యపోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. 8 ఏండ్ల క్రితం తెలంగాణకు, నేటి తెలంగాణకు పొంతన కూడా లేదు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరిగింది. భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ స్టేట్గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.
33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను మంజూరు చేసుకున్నాం అని కేసీఆర్ వెల్లడించారు. అందులో భాగంగానే కొత్తగూడెంకు మెడికల్ కాలేజీ వచ్చింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ప్రజలు డిమాండ్, ధర్నాలు చేయకుండానే కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కులమతాలకు భిన్నంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి కార్యక్రమాలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే.. పూర్తి మానవీయ కోణంతో ప్రవేశపెట్టాం. గర్భం దాల్చిన తర్వాత కూలీ పనులు చేసే మహిళలు.. తమ వేతనాన్ని కోల్పోతారు కాబట్టి.. ఆ వేతనాన్ని భర్తీ చేసేందుకు పలు విడతల్లో నిధులు ఇస్తున్నాం. దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.