యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. టెంపుల్ సిటీతోపాటు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న కాటేజీల నిర్మాణం ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్ర భావన వచ్చేలా ఉండాలని సూచించా రు. ఆలయ అభివృద్ధి కోసం రూ.43 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఫోన్లో సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొన్నారు.
తొలుత గుట్ట చుట్టూ వాహనంలో గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా కొండ కింద ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో గుట్ట అభివృద్ధిపై మంత్రులు, వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైటీడీఏ పరిధిలో ఉన్న వంద ఎకరాల అడవిని నృసిం హ అభయారణ్యం పేరుతో అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుతో అద్భుత కల్యాణ మండపం నిర్మించాలని ఆదేశించారు. 250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా, అద్భుతంగా నిర్మించాలని సూచించారు. వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలని దిశానిర్దేశం చేశారు. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రణాళికతో గుట్ట పరిసరాల అభివృద్ధి
దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన 80జీ అనుమతులు వెంటనే తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రణాళిక ప్రకారం యాదగిరిగుట్ట పరిసరాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. హెలీప్యాడ్ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పారు. వైటీడీఏకు మొత్తం 2,157 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని, దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని సీఎం స్పష్టంచేశారు.
ఈ భూములను ఆలయ అవసరాలు, పోలీస్శాఖ, ఫైర్స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆలయ అర్చకులు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. యాదగిరిగుట్టలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయట ప్రాంతం లో ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ వైభవానికి అనుగుణంగా వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేట్ నిర్మాణాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు
ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు సహా ఇతర అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయం సహా రింగ్రోడ్డు, ఇతర ఏ ప్రాంతంలోనూ చుక్క నీరు నిలువకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీక్షాపరుల మండపం, వ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్, స్టామ్ వాటర్, డ్రెయిన్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యాదాద్రీశుడికి హిమాన్షు పట్టు వస్ర్తాలు
పూజా కార్యక్రమాల తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకొన్న కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ కుటుంబం తరఫున ఆయన మనుమడు హిమాన్షు యాదాద్రీశుడికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు సీఎం దంపతులను, కుటుంబసభ్యులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం 11:50 గంటలకు ప్రగతిరథంలో యాదగిరిగుట్టకు చేరుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 4:32 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జీ జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఆశన్నగారి జీవన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1.16 కిలోల బంగారం విరాళం
స్వామివారి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రకటించిన 1.16 కిలోల బంగారాన్ని సమర్పించుకొన్నారు. ఇందుకు సంబంధించి రూ.52.48 లక్షల చెక్కును కేసీఆర్ మనమడు హిమాన్షు ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి రూ.50.15 లక్షలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేంరెడ్డి నర్సింహారెడ్డి రూ.51 లక్షలు, ఏనుగు దయానందరెడ్డి రూ.50.04 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. మొత్తంగా శుక్రవారం ఒక్కరోజే రూ.2.03 కోట్లు విరాళంగా వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు.