హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు సీఎం కొనియాడారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.
దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడివున్నదని కేసీఆర్ అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ అన్నారు.