హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(ఆగస్ట్ 6) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసిఆర్ తెలిపారు. జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ కలనుసాకారం చేస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.