హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు, బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని(ఏప్రిల్ 5) పురస్కరించుకొని.. ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్కు కేసీఆర్ నివాళులర్పించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని సీఎం కొనియాడారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. తద్వారా సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.