ఖమ్మం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సూర్యాపేట/నర్సింహులపేట: సూర్యాపేట పట్టణమంతా గులాబీపూల వనం పూసింది.. డోర్నకల్లో జనభేరి మోగింది. మధిరలో ప్రభంజనం హోరెత్తగా, వైరాను జన ఉప్పె న ముంచెత్తింది. సూర్యాపేట, మధిర, వైరా, డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడలో మంగళవారం సీఎం కేసీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు జగదీశ్రెడ్డి, రెడ్యానాయక్, కమల్రాజ్, మదన్లాల్ అధ్యక్షతన జరిగిన ఆయా సభలకు వెల్లువలా జనం తరలివచ్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రం జన జాతరను తలపించింది. సాయంత్రం 4 గంటలకు సభ ఉండగా, 3 గంటలకే సభాప్రాంగణం నిండిపోయింది. చుట్టూ రెండు కిలోమీటర్ల మేర రోడ్లపైన జనం, వాహనాల రద్దీ కనిపించింది. జనం తండోపతండాలుగా రావడంతో వీఐపీ గ్యాలరీలోకి ప్రజలను అనుమతించారు. దీంతో సీఎం సభావేదిక వరకు ప్రజలు వచ్చారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రస్తావించినప్పుడు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. నియోజకవర్గానికి ఆటోనగర్, పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి కోరగా, వాటితోపాటు డ్రైపోర్టు కూడా ఇస్తానని సీఎం ప్రకటించడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈసారి మంత్రి జగదీశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి.. ఇంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కత్తి ఒకరికిచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా?
ఖమ్మం జిల్లా మధిర, వైరా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు జన ఉప్పెనను తలపించాయి. ఊళ్లకు ఊళ్లు జనం ప్రభంజనం గా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. సీఎం మాట్లాడుతున్నంత సేపు ఈలలు, కేరింతలతో మద్దతు పలికారు. మధిరలో అక్కడి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రస్తావనను సీఎం తీసుకొచ్చినప్పుడల్లా, వంగ్యాస్ర్తాలు సంధించినప్పుడల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే సాధ్యం కాదని, ఈసారి భట్టి విక్రమార్కను ఓడించి కమల్రాజును గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం ప్రస్తావించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. వైరా సభలో సీఎం కేసీఆర్ కొందరు కాంగ్రెస్ నాయకుల డబ్బు అహంకారంపై పదునైన బాణాలు వదిలారు. కొందరు కన్నూమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమంటూ మాట్లాడుతున్నారని, అసలు అసెంబ్లీ గేటు దాటనీయకపోవడానికి వారెవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, నోట్ల స్వాములకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున కరతాళధ్వనులతో మద్దతు తెలిపారు. వైరా, మధిరల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని భరోసా ఇవ్వడంతో ఆనందంతో సందడి చేశారు.
ఆటాపాటలతో మైమరిచిన జనం
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ జనసంద్రమైంది. వెల్లువలా జనం తరలివచ్చారు. గులాబీ జెండాలే రామక్క పాటతోపాటు కళాకారుల ఆటపాటలకు మహిళలు, యువకులు ఉత్సాహంగా ఎక్కడికక్కడ నృత్యా లు చేశారు. కేసీఆర్ ప్రసంగ సమయంలో జనం చప్పట్లు, ఈలలతో పరిసర ప్రాంతం మార్మోగింది. సభాస్థలిలో ఎంత మంది ఉన్నారో బయటా అంత కంటే ఎక్కువగా కనిపించారు. మీరు ఎమ్మెల్యేగా రెడ్యాను గెలిపిస్తే ఆయనకు మంచి హోదా కల్పిస్తానని చెప్పడంతో జనం చప్పట్లు, ఈలలతో మద్దతు ప్రకటించారు.