‘పండేటోనికి ఎరుక గూనివాటం’ అన్నట్టు మన తెలంగాణ యవ్వారం ఏంటో మనకు తెలుస్తది. మనం రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నం. ‘నువ్ కచ్చితంగా ప్రతి బావికి, ప్రతి మోటర్కు మీటర్లు పెట్టాలె’ అని మోదీ అంటడు. ‘నా ప్రాణం పోయినా నేను పెట్టను’ అని చెప్పిన. అందుకు వాళ్లు ఒకటికాదు.. రెండు కాదు.. 25 వేల కోట్ల రూపాయలు మనకు రాకుండా ఆపిండ్రు. వచ్చే బడ్జెట్ను కట్ చేసిన్రు. ఇదే విషయాన్ని హైదరాబాద్లో నిర్మలాసీతారామన్ ఒప్పుకున్నది.
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన, చేస్తున్న ద్రోహంపై సీఎం కేసీఆర్ చెప్తున్నదే నిజమని తేలింది. రైతులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధ శత్రువులని, వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటును ఆగం పట్టిస్తరని ఆయన చేస్తున్న హెచ్చరికలు అక్షర సత్యాలని తేలిపోయింది. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాజాప్తా ప్రకటిస్తే.. మోటర్లకు మీటర్లు పెట్టడమే తమ విధానమని బీజేపీ స్పష్టం చేసింది.
స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ర్టాలు రుణం రూపంలో నిధులు సేకరించుకోవాలంటే మోటర్లకు మీటర్లు పెట్టాలని నిబంధన విధించాం. అన్ని రాష్ర్టాలు మోటర్లకు మీటర్లు పెట్టి నిధులు తీసుకున్నాయి. తెలంగాణలో మాత్రం పెట్టలేదు. నిధుల సేకరణకు మేం అనుమతి ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.
దీంతో ‘మోదీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టుమని ఒత్తిడి తెస్తే.. నా తల తెగిపడినా సరే మీటర్లు పెట్టను అని చెప్పిన’ అన్న సీఎం కేసీఆర్ మాటే నిజమని స్వయంగా కేంద్ర మంత్రి ఒప్పుకున్నట్టయ్యింది. తద్వారా ఈ దేశంలో రైతు పక్షాన నిలబడిన ఏకైక, దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టమైంది. అంతేకాదు.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు పెట్టారు. ఇందులో కాంగ్రెస్ పాలిత, ఇండియా కూటమి పాలిత రాష్ర్టాలు కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ విధానమే 3 గంటల కరెంటు, మోటర్లకు మీటర్లు అని స్పష్టమవుతున్నది.
12 రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ విలువల రూ.11.54 లక్షల కోట్లు. ఈ లెక్కన కేంద్రం చెప్పినట్టుగా మోటర్లకు మీటర్లు బిగిస్తే రాష్ర్టానికి సుమారు రూ.5,700 కోట్ల మేర అదనపు నిధులు సేకరించే అవకాశం ఉండేది. అంటే ఐదేండ్లకు దాదాపు రూ.25 వేల కోట్లకుపైగా రాష్ర్టానికి అదనంగా నిధులు వచ్చేవి. కానీ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాలు ఈ ఏడాది జూన్ వరకే మోటర్లు బిగించాయి. రూ.66 వేల కోట్ల మేర అదనపు నిధులు పొందాయి.
ఇందులో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ప్రస్తుతం ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటివి.. ఏపీ, ఒడిశా, మేఘాలయ వంటి రాష్ర్టాలు కూడా ఉన్నాయి. మరో 8 రాష్ట్రాలు తాము మోటర్లకు మీటర్లు పెడుతున్నామని, వాటిని పరిశీలించి రుణం ఇవ్వాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అంటే.. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద రాష్ర్టాలన్నీ మోటర్లకు మీటర్లు పెడుతున్నాయి. కానీ కేంద్రాన్ని ఎదిరించి రైతుల పక్షాన నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం అవుతున్నది.
కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు, మోటర్లకు మీటర్లు
రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంటును బంద్ చేసి, 3 గంటలు ఇవ్వడంతోపాటు.. ప్రతి మోటర్కు మీటర్ పెడతారని స్పష్టమవుతున్నది. కేంద్రం చెప్పినట్టు మోటర్లకు మీటర్లు పెట్టి, అదనంగా నిధులు సేకరించిన రాష్ర్టాల్లో కాంగ్రెస్ పాలితన రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటివి ఉన్నాయి. అంతేకాదు… రైతుల ఉసురుపోసుకొని నిధులు తీసుకున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ టాప్లో ఉన్నది. ఆ రాష్ట్రం ఇప్పటివరకు రూ.11,308 కోట్లు నిధులు సేకరించింది. కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు దండుకోవడంపై దృష్టిపెట్టింది. ఈ ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న రాబడుల్లో విద్యుత్తు సంస్కరణల ద్వారా సేకరించే 0.5 శాతం నిధులు ఉంటాయని పేర్కొన్నది. అంటే.. మోటర్లకు మీటర్లు పెట్టినందుకు తమకు ఈ ఏడాది నుంచి డబ్బులు వస్తాయని చెప్పుకున్నది.
మొదటి నుంచీ రైతుల కరెంటుపై కుట్ర
బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్తుకు మంగళం పాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది. రైతును ఆదుకుంటున్న ఈ పథకాన్ని ఏ విధంగానైనా ఎత్తివేయాలని అనేక కుట్రలు చేసింది. సామ, దాన, బేధ, దండోపాయాలను వాడింది. ముందుగా.. విద్యుత్తు చట్ట సవరణ బిల్లును అస్త్రంగా వాడింది.
2020 ఏప్రిల్ 17న రాష్ర్టాలకు పంపిన ముసాయిదాలో.. ‘రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందే వర్గాల నుంచి డిస్కమ్లు ముందుగా బిల్లులు వసూలు చేయాలి. ఆ తర్వాత కావాలంటే నగదు బదిలీ రూపంలో వారికి తిరిగి ఇవ్వవచ్చు’ అని పేర్కొన్నది. అంటే రైతుల నుంచి కరెంటు బిల్లు వసూలు చేయాలని స్పష్టంగా చెప్పింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కొంతకాలం తర్వాత రెండో కుట్రకు తెరలేపింది.
2020 డిసెంబర్ 31న విడుదల చేసిన విద్యుత్తు వినియోగదారుల హక్కుల నిబంధనల్లో ‘మీటర్లు లేకుండా విద్యుత్తు కనెక్షన్ జారీ చేయరాదు’ అని స్పష్టం చేసింది. ఆ తర్వాత రెండు నెలలకే మూడోసారి కుట్ర చేసింది.
2021 ఫిబ్రవరి 5వ తేదీన రాష్ర్టాలకు పంపిన విద్యుత్తు చట్ట సవరణ రెండో ముసాయిదాలో ‘ఏ రంగంలో అయినా విద్యుత్తు కనెక్షన్కు మీటర్ తప్పనిసరి’ అని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సహా అనేక రాష్ర్టాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా మోటర్లకు మీటర్లపై వెనక్కి తగ్గలేదు. దీంతో రాష్ర్టాలకు నిధుల ఆశ చూపెట్టాలని ప్రయత్నించింది. ఆ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్లో ‘విద్యుత్తు సంస్కరణలకు ఒప్పుకున్న రాష్ర్టాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా జీఎస్డీపీలో 0.5 శాతం రుణాలు తీసుకోవడానికి అనుమతిస్తాం’ అని చెప్పింది. ఈ సడలింపును ఐదేండ్లపాటు అమలు చేస్తామని ప్రకటించింది. అంతటితో ఆగలేదు..
2021 ఏప్రిల్ 27న విడుదల చేసిన జాతీయ విద్యుత్తు విధాన ముసాయిదాలో.. ఈ పాలసీ నోటిఫికేషన్ వెలువడిన ఏడాదిలోగా మీటర్లు బిగించాలని ఆదేశించింది.
2021 అక్టోబర్ 6న అమల్లోకి తెచ్చిన కొత్త ఆడిట్ నిబంధనల్లో ‘మూడేండ్లలో వినియోగదారులందరికీ కమ్యూనికేబుల్ మీటర్లు బిగించాలి’ అని ఆదేశించింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే.. రైతుల మోటర్లకు మీటర్లు బిగించడం. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ఒక్కడే మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలుగానీ, ఇతర పక్షాలుగానీ మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్రాన్ని నిలదీయలేదు.