CM KCR | భూపాలపల్లి : ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు రూ. 1000 కోట్లు పంచారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు బోనస్, లాభాల వాటా కింద 32 శాతం ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
సింగరేణి మనది మనకే ఉండే. ఉన్న తెలంగాణను ఊడగొట్టినట్టు, సింగరేణిని ముంచిది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి చేత కాక కేంద్రం వద్ద అప్పులు తెచ్చి, అవి తిరిగి కట్టలేక 49 శాతం వాటా వాళ్లకు కట్టబెట్టారు. కాంగ్రెస్ చేతకాని తనం వల్ల వంద శాతం మనకున్న సింగరేణి, అప్పుల కింద కేంద్రానికి సగం వాటా పోయింది. ఇదే కాంగ్రెస్ ఇంటక్, ఐటక్ నాయకులు డిపెండెంట్ ఉద్యోగాలు వద్దని సంతకాలు పెట్టిన భక్తులు కూడా వాళ్లే. ఇవాళ 15 వేల మంది ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో 1000 కోట్లు పంచారా..? బోనస్ కానీ, లాభాలా వాటా కానీ ఇవాళ 32 శాతం ఇచ్చుకుని ముందుకు పోతున్నాం. సింగరేణి అన్ని రకాలుగా కాపాడే బాధ్యత తీసుకుని ముందుకు పోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
భూపాలపల్లికి వంద శాతం ఇంజినీరింగ్ కాలేజీ తీసుకువస్తాం. ఆ బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. భూమపాల్లిని జిల్లా చేసిందే కేసీఆర్. గతంలో మధుసూదనాచారి ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు వచ్చాను. భూపాలపల్లి చాలా అభివృద్ధి చేసుకున్నాం. వెంకటరమణారెడ్డి నా వద్దకు ఎప్పుడొచ్చినా నియోజకవర్గం పని అడుగుతడు. పర్సనల్ పని అడగలేదు. సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. తప్పకుండా భూపాలపల్లికి మేలు జరగాలంటే వెంకటరమణా రెడ్డి గెలవాలి. గెలిస్తేనే లాభం జరుగుతది. లేకపోతే కింద మీద అయితది, ఆగమయ్యే ఆస్కారం ఉంటది. మీరంతా పట్టుబట్టి వర్షంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో సభకు ఎలా హాజరయ్యారో, ఇదే పద్ధతిలో నవంబర్ 30న ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతున్నా అని చెబుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.