నీలగిరి, జూలై 22 : ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఐఎంఏల సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలోని నర్సులు, టెక్నీషియన్లు అలాగే పారా మెడికల్ సిబ్బంది సిబ్బందికి బుధవారం ఐకాన్ ఆస్పత్రిలో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐకాన్ ఆస్పత్రి ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా.రవిశంకర్ కన్నా, డా.సాయి మౌనిక చెరుకూరి, డా.సాయి లావణ్య కడిమి, డా. త్రిశూల్రెడ్డి గుండెపోటు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్ విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుండె ఆగిపోయిన తర్వాత మొదటి 4 నుండి 6 నిమిషాల్లో సీపీఆర్ ఇవ్వడం ద్వారా మెదడు దెబ్బతినకుండా రోగి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సీపీఆర్ సమయంలో జరిగే సాధారణ తప్పులు, పిల్లలు, పెద్దలకు వేరుగా ఇచ్చే పద్ధతుల గురించి నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ హాస్పిటల్ వైద్య బృందం, ఐఎంఏ సభ్యులు, సీఎస్ఐ సభ్యులు, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 200కి పైగా ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.