మెదక్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ: తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్లలోనే తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఎదిగిందని చెప్పారు. కొన్ని రాష్ర్టాల్లో సరైన అసెంబ్లీ, సెక్రటేరియట్లు కూడా లేవని, వాటి కంటే మన సమీకృత కలెక్టరేట్లు పెద్దగా ఉన్నాయని వివరించారు. బుధవారం ఆయన మెదక్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కాం ప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు. అనంత రం జిల్లా అధికారులు, ఉద్యోగులతో ప్రత్యే క సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే పాలన చేతగాదంటూ ఎద్దేవా చేసినోళ్లు ఈరోజు ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. అభివృద్ధికి కొలమానంగా భావించే తలసరి ఆదా యం, జీడీపీ, తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్గా ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, ఇప్పడు 24వ కలెక్టరేట్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. మెదక్ కలెక్టరేట్ ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి కూడా తెలంగాణ బిడ్డేనంటూ ఆమెను అభినందించారు. ఘణపురం ఆయకట్టును బాగు చేసుకున్నామని, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. పచ్చని పంటలతో మెదక్ అలరారుతున్నదని, రానున్న రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని అభయమిచ్చారు.
కలెక్టరేట్ సముదాయం నిర్మాణంతో అన్ని సేవలు ఒకేచోట లభిస్తాయని సీఎస్ శాంతికుమారి చెప్పారు. తాను మెదక్ జిల్లాలో వివిధ హోదాల్లో నాలుగేండ్లు పని చేశానని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహమూద్అలీ, ప్రశాంత్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలాత శేఖర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.