నల్లగొండ: తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో జనం గోస అనుభవించిండ్రని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. చెప్పుడు మాటలు విని ఎవరికి పడితే వాళ్లకు ఓటేయొద్దని కోరారు. ఎవరు గెలిస్తే మంచి జరుగుతదో.. ఎవరు గెలిస్తే ఆగమైతమో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అభ్యర్థుల గుణగణాలను, పార్టీల చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు.
‘మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క హక్కు ఓటు. అది దుర్వినియోగం అయితే మీ భవిష్యత్తు అంధకారమైతది. కాబట్టి ఓటేసేటప్పుడు బాగా ఆలోచించి ఓటేయాలని నేను కోరుతున్న. ఎవరికి ఓటేయాలనే దానిపై గ్రామాలల్ల చర్చపెట్టి రాయేదో.. రత్నమేదో గుర్తించాలె. అభ్యర్థులు ఎలాంటోళ్లు, వాళ్ల వెనుకున్న పార్టీలు ఎలాంటివి..? అనే అంశాలపై కూడా చర్చ చేసి ఓట్లేయాలె. నేనొస్తుంటే చాలా సంతోషం అనిపిచ్చింది. మళ్ల యాసింగి పంటలకు పొలాలన్ని తడిపి నీళ్లతోని కనపడుతున్నయ్. అంతకుముందు నల్లగొండలో తిరిగితే లక్షల ఎకరాల్లో ఆముదం పంట కనిపించేది. ఇప్పుడు బ్రహ్మాండంగా వరి పంటలు పండుతున్నయ్’ అని సీఎం తెలిపారు.
‘బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, అంతకుముందు కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మీరు బేరీజు వేసుకోవాలె. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏదీ సక్కగ లేకుండె. మంచి నీళ్లు లేవు. సాగు నీళ్లు లేవు. కరెంటు లేదు. భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు. రైతుల ఆకలి చావులు. నల్లగొండ జిల్లా బిడ్డలంతా హైదరాబాద్కు పోయి కూలీనాలీ చేసుకుని బతుకుడు. ఇది కాంగ్రెస్ 50 ఏండ్ల చరిత్ర. పొరపాటున మళ్ల కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే అయ్యే పాత రోజులు వస్తయ్’ అని సీఎం హెచ్చరించారు.