CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది.. ఈ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అమర జ్యోతి.. మన గుండెల్లో నిలిచే విధంగా నిర్మించుకున్నాం. అమరుల పేరు ఎప్పుడూ మన మదిలో ఉండేలా చేశాం. మొత్తం అమరవీరుల ఫోటోలను ప్రదర్శిస్తాం అని కేసీఆర్ తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
జై తెలంగాణ.. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ రోజు రెండు పార్శ్వాలు కలగలిసి ఉన్నాయి. నిన్నటి దాకా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నాం. ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని నిర్ణయించాం. దాంతోనే అమర జ్యోతి ప్రారంభం చివరి దశలో పెట్టుకున్నాం. మీరందరూ విచ్చేసి చేతుల్లో దీపాలు చేతబూని అమరలకు అర్థవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంలో సంతోషం ఒక పాలు అయితే.. విషాదం రెండు పాళ్లుగా ఉందన్నారు సీఎం. కానీ ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్రకోణాలు దాగి ఉండి, అమాయకులైనటువంటి అనాటి రాజకీయ నాయకులు, ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మరికొందరు బలైపోవడం జరిగింది. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలయ్యాయి. మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్యమ పొలికేక రావడం, అక్కడ్నుంచి 1965, 1966 నుంచి మొదలుకొని 1967 నాటికి యూనివర్సిటీలకు చేరుకోవడం జరిగింది. చాలా ధైర్యంగా 58 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జీవోతో కొనసాగిన టీఎన్జీవోలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఆసాంతం ఉన్నారు. ఎన్నో రకాల కేసులు, వేధింపులు, భయంకరమైన పీడీ యాక్టులు, ఉద్యోగుల బర్తరఫ్లు, అనుభవించిన బాధలే ఇవాళ తెలంగాణ. ఆనాటి టీఎన్జీవో నేత ఆమోస్ను వీసా యాక్ట్ కింద పెట్టి ఉద్యోగాల్లో తీసేశారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా మందుకు వచ్చి పోరాటం చేశారని కేసీఆర్ ప్రశంసించారు. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో వీ ప్రకాశ్, మధుసూదనాచారి లాంటి పిడికెడు మందితో మేధోమదనం చేశాం. ఈ సారి రాష్ట్రం సాధించి తీరాలనే ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులను కలిశాం. ఒక వ్యూహాం రచించుకుని బయల్దేరాం. ఆ బయల్దేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ను కలిశాం. ఆయన ఆజన్మ తెలంగాణవాది. కానీ ఆయన రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేవి. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన. రెండోది శనివారం పూర్తిగా నిరాహారంగా ఉపవాసం ఉండేవారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వెనుకడగు వేయలేదు. 1969 ఉద్యమం తర్వాత ఏం జరిగిందని జయశంకర్ను అడిగాం. కేసీఆర్ లాంటి వ్యక్తి రాకపోతడా అని చెప్పి మీటింగ్లకు వెళ్లి మాట్లాడేవాళ్లం అని చెప్పేవారు. తెలంగాణ ఉద్యమ సోయి బలతికుండాలని ప్రయత్నాలు చేశామని చెప్పారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఉద్యమానికి జీవం పోశాయి. ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని కేసీఆర్ తెలిపారు. మలిదశ ఉద్యమంలో అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, హింస, పోలీసు కాల్పులు, ఉద్యమం నీరుగారిపోవడం వంటివి చూశాం అని కేసీఆర్ గుర్తు చేశారు.