హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు అధికారమిస్తే.. రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశంగా మారుస్తామని ప్రకటించారు. దేశం మొత్తం ఉచిత విద్యుత్తునివ్వడం అసాధ్యమేమి కాదని చెప్పా రు. ఏపీకి చెందిన పలువురు నేతలు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను తమాషాగా చెప్పడం లేదని, పూర్తిగా అధ్యయనం చేసి నిష్ణాతులతో మాట్లాడి.. చెబుతున్నానని, రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. తెలంగాణలో కలపమంటున్నరు.
మహారాష్ట్ర బార్డర్లో.. కర్నాటకలో తెలంగాణ బార్డర్లో గొడవలైతున్నయి. తెలంగాణలో పథకాలు మాకు పెట్టడండి లేదా.. మమ్మల్ని తెలంగాణలో కలపండి అని అడుగుతున్నరు. దేశంలోని 6.64 లక్షల గ్రామాల్లో మన కమిటీలు ఏర్పడాలి. రైతు కమిటీలు.. దళిత సంఘాలు ఏర్పడాలి. సంక్రాంతి తెల్లారి నుంచి కార్యాచరణ తీసుకుంటున్నాం. దేశంలోని మొత్తం 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాంతరంగా పరుగెత్తాలి. ఈ ఆలోచనా సరళి మహారాష్ట్రలో.. ఉత్తరప్రదేశ్లో.. మధ్యప్రదేశ్లో.. బెంగాల్లో రగులుకోవాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. వెస్ట్రన్ ఘాట్స్ నుంచి ఈస్ట్రన్ ఘాట్స్ వరకు రగలాలి. లక్ష కిలోమీటర్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మంచి కోసం మనం వేసే ఒక్క అడుగు మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. కష్టం తప్పదు. ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది ముఖ్యం. వందకు వందశాతం మంచి జరుగుతుంది.
మనకేం ఖర్మ..
ఇంత ఆపారమైన జల, మానవ, ప్రకృతి సంపద ఉన్న దేశం మనది. ఏమీలేని సింగపూర్ ఎట్ల తయారయ్యింది? మనకన్నా దారుణంగా ఉన్న దక్షిణ కొరియా ఎట్ల తయారయ్యింది? మహమ్మద్ మహతీర్ నాయకత్వంలో మలేషియా ఎట్ల తయారయ్యింది? అణు బాంబులతో నాశనమైన జపాన్ ఎట్ల పుంజుకున్నది? మనకేం ఖర్మ? మనది ప్రపంచంలోనే గొప్ప దృఢమైన ఆర్థిక వ్యవస్థ. దురదృష్టవశాత్తు ఒక ఒరవడిల పడి కొట్టుకపోతున్నం. దీనిని ఆపాలి. విజ్ఞులైన ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను చెప్పినవి వాస్తవాలా కాదా చర్చపెట్టండి.
దండలు ఎప్పుడు వేస్తరు?
కట్టమంచి రామలింగారెడ్డి ఒక రోజు సభకు పోయిండు. ఒకాయన వచ్చి సార్.. మీ కోసం పెద్ద దండ తెచ్చిన వేసుకోవాలె సార్. లేకపోతే నా పరువుపోతది అంటే.. నేను వేసుకోను. ఓ నాలుగు మాటలు చెబుత విను. అప్పుడు కూడా వేసుకోమంటే ఆలోచిస్తా.. అంటే సరే మంచిదని అన్నడట. రామలింగారెడ్డి మాట్లాడుతూ మనిషికి దండ వేసేది రెండే రెండు సార్లు. నంబర్ వన్ పెండ్లి జరిగినప్పుడు. నేను స్వత్రంత్య పోరాటానికి పోయిన గనుక తీరికలేదు. బ్రహ్మచారిగనే ఉన్న. పెండ్లి దండకు నాకర్హత లేదు. నంబర్ టూ దండ వేయాలె. నిటారుగ నీ ఎదురుగ బతికే ఉన్న. ఇప్పుడు నీ దయరా బాబు.. వేస్తనంటే వెయ్యి అంటే ఆ అభిమాని రెండుకాళ్లు మొక్కి తప్పుచేయనని అన్నడట. అట్లా ఉన్నది పరిస్థితి (సభలో నవ్వులు).
మనం జీవితంలో రొటీన్ అయిపోయినం. ఏదీ సీరియస్గా తీసుకోం. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిస్తే దండలే దండలు. చొక్కా అంతా నానిపోతది. దండలున్న పురుగులన్నీ కుడుతయి. మెడలు వంగిపోతయి. ఇదా రాజకీయం? ఈ తంతు జరుగుతూ ఉండాల్నా? ఈ రొటీన్ ఆలోచన భావజాలం నుంచి గోల్మాల్ వ్యవహారం నుంచి బయటపడుతూ ప్రజలను బయటపడేసే ప్రక్రియ కోసం పుట్టిందే బీఆర్ఎస్.
నాకెందుకనుకుంటే స్వాతంత్య్రం వచ్చేదా?
ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ గొప్పనేత.. బార్ ఎట్ లా. నెహ్రూ పెద్ద కోటీశ్వరుడు. చిన్న వయస్సులో భవిష్యత్తును.. ప్రాణాన్ని త్యాగం చేసిన భగత్సింగ్. వీళ్లంతా నాకెందుకనుకుంటే మనకు స్వాతంత్య్రం వచ్చేది కాదు. ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కాకపోతే.. ఒక వెలుగు దివ్వె, చైతన్య జ్యోతి వెలుగకపోతే.. సమాజం ఏమై పోవాలి. ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం. నీళ్లు ఉంటయి.. కాని నీళ్లురావు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటరు. ఏం ఖర్మ? కరెంట్ ఉంటది. కాని కరెంట్ రాదు. ఇదే బీఆర్ఎస్ అడిగే ప్రశ్న.
ఉచిత విద్యుత్తు ఖర్చు 1.45 లక్షల కోట్లు
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలి. 24 గంటలు ఇవ్వాలి. ఏం అసంభవమా? దేశానికంతా ఉచిత విద్యుత్తునిస్తే అయ్యే ఖర్చు రూ. 1.45 లక్షల కోట్లు. ఆ మాత్రం డబ్బులేదా? మోటర్లు కాలకుండా.. ట్రాన్స్ఫార్మర్ పేలకుండా.. రాత్రిపూట కరెంట్ కోసం పొలాల కాడికి పోకుండా. క్వాలిటీ పవర్ వచ్చి అంతా సర్దుకుంటే ఎంత సంతోషం. ఎంత అభివృద్ధి జరుగుతది. ఎంత ఆదాయం వస్తది. దళితబంధు అద్భుతమైన పథకం తెలంగాణలో అమలవుతున్నది. ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్లలో రిజర్వేషన్ అమలుచేస్తున్నం. మెడికల్, ఫర్టిలైజర్, వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం. ఈ సందర్భంగా దేశంలోని దళిత జాతికి నేను ప్రామిస్ చేస్తున్నా.. బీఆర్ఎస్ను బలపర్చి గెలిపిచ్చుకోండ్రి. రైతులందరికీ ఉచిత విద్యుత్తునిస్తాం.. దళితబిడ్డలందరికీ సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు రెండున్నర లక్షల కోట్లను దళితబంధు కోసం ఖర్చు చేస్తం.
మాది నేషనలైజేషన్..
భారత ప్రధాని మోదీ గారికి ఈ వేదిక నుంచి చెబుతున్నా.. విశాఖ ఉక్కును అమ్ముతారా.. అమ్మేయండి ఫర్వాలేదు. మీది ప్రైవేటైజేషన్.. మాది నేషనలైజేషన్. విశాఖ ఉక్కును మోదీ ప్రభుత్వం అమ్మినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటది. ఇరవై వేల కోట్లు నష్టపోయినా.. తిరిగి పబ్లిక్ సెక్టార్ల పెడుతం. తెలంగాణల విద్యుత్తు ఉత్పత్తి అయితే వచ్చి నా మీద దాడులు చేసిన్రు. ప్రైవేట్కియ్యాలని ఒత్తిడి తెచ్చిన్రు. నేను సచ్చినా ఒక్క మెగావాట్ కూడా ఇయ్య అని చెప్పిన.
రాజకీయాలంటే గేమ్ కాదు.. టాస్క్
రాజకీయాలు ఒక గేమ్గా తయారయ్యాయి. కానీ రాజకీయాలు గేమ్ కాదు. ఒక టాస్క్. రాజకీయాల అసలు గురి లక్ష్యం చేరడం. గోల్మాల్ చేయడం కాదు. ప్రజలను బ్లఫ్ చేయడం కాదు. మన కండ్ల ముందు గేమ్ జరుగుతున్నది. 500 ఎంపీలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. లోక్సభలో బిల్లు పాస్ చేస్తం. తెల్లారి రాజ్యసభలో అటకాయిస్తది.
అరే భయ్యా.. మై కర్ దియా.. ఉన్హోనే రోక్ దియా.. మేం చేసినం కాని.. వాళ్లు అపిండ్రండి అంటున్నరు. ఇప్పడు ఇదే జరుగుతున్నది. ఇలాంటి అవరోధాలను.. ప్రగతి గమనంలో ఎదురయ్యే ఆటంకాలు.. అవరోధాలను తీసేయ్యాలి. కానీ ఎన్నికల గండం ఎట్లా గట్టెక్కాలె.. గోల్మాల్.. మిర్చి మసాలా కలిపి, వ్యంగ్యం జోడించి జనాల్ని ఎంగేజ్చేయాలె.. అడ్డదారులు తొక్కాలె.. గెలవాలె అవతల పారెయ్యాలె. జనం మళ్లీ నిరాశకు గురికావాలె. ఈ రాజకీయ ప్రక్రియ నుంచి, గేమ్ నుంచి.. ఇలాంటి ఆలోచన సరళి నుంచి ప్రజలను బయటపడేసి భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఆవిర్భవించినదే బీఆర్ఎస్.