హైదరాబాద్ : కౌలు రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులను పట్టించుకుంటే అసలు రైతులకే మోసం వస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
గతంలో రైతుల యొక్క భూములను అతిచిన్న స్థాయి అధికారులు చాలా అరాకిరి చేశారు. తెలంగాణలో భూముల విలువ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పారదర్శకత కోసం ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చాలా ఉపశమనం వచ్చింది. అబ్దుల్లాపూర్మెట్ లాంటి ఘటనలు జరగకుండా ధరణి తెచ్చాం. ధరణి పోర్టల్లో అనేక లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూమిని కాపాడుకునే రైతును కౌలు రైతు పేరు మీద బలిచేయదలుచుకోలేదు. ధరణి పోర్టల్లో ఆ కాలమ్స్ తొలగించాం. కౌలు అనేది ప్రయివేటు వ్యవహారం. ఇది ఆ రైతుకు, కౌలు రైతుకు మధ్య ఉన్న ఒప్పందం.
కౌలుదారు మారినప్పుడల్లా ప్రభుత్వాలు రికార్డులను మార్చాలంటే కుదరదు. అది ప్రభుత్వం పని కాదు. కౌలు రైతుల విషయాన్ని తాము పట్టించుకోము. కౌలు రైతుల పట్ల మాకు మానవీయత ఉంది. కానీ అసలు రైతు నష్టపోవొద్దు అనేది మా పాలసీ. అసలు రైతులు తమ భూములను వారసత్వంగా కాపాడుకుంటున్నారు. అసలు రైతులకు కష్టాలు వస్తే ఉపవాసమైనా ఉంటారు కానీ.. భూములను అమ్ముకోరు. అలా కాపాడుకున్న భూమిని కొందరు పైరవీకారుల వల్ల గద్దల్లా తన్నుకుపోయే పరిస్థితి ఉండొద్దని, రైతుల సంక్షేమం దృష్ట్యా కౌలు రైతులను పట్టించుకోవడం లేదు.
కౌలు రైతులను పట్టించుకుంటే అసలు రైతులకు మోసం వస్తుంది. ఒక వేళ కౌలు రైతులు నష్టపోతే.. తప్పకుండా వారిని మానవీయ కోణంలో ఆదుకుంటాం. ఆర్వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు ఇవ్వకుండే. కానీ తర్వాత ఆ భూములకు పట్టా ఉండటంతో 3 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నాం. రైతాంగానికి మంచి పనులు చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. కౌలు రైతులు, గిరిజన రైతులు నష్టపోతే.. వందో, రెండు వందల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదన్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం కేసీఆర్.