వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని తెలిపారు. దీనికి వనపర్తి జిల్లా వేదికగా శ్రీకారం చుట్టాం. వనపర్తికి ఆ గౌరవం దక్కుతుంది. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని పేర్కొన్నారు. మీ ముందు ఈ హోదాలో నిలబడ్డామంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్యనే కారణం. భవిష్యత్లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో నిర్మాణం కాబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కూడా ప్రారంభం కాబోతుందన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.