‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వవిద్య పటిష్ఠం
రూ. 10 వేల కోట్లతో మన ఊరు- మన బడి
వనపర్తి జెడ్పీ పాఠశాలలో సీఎం కేసీఆర్
మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం
హైదరాబాద్, మార్చి 8 : తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని మంగళవారం వనపర్తిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్ఠం చేసే గొప్ప కార్యక్రమం మన ఊరు-మన బడికి వనపర్తి జిల్లాలో శ్రీకారం చుట్టినం. నాతోపాటు ఈ వేదికపై ఉన్నవారందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి వచ్చినవాళ్లమే. మేము మీ ముందు ఈ హోదాల్లో నిలబడ్డామంటే ఆ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మా గురువులు చెప్పిన విద్యే కారణం. ఈ పాఠశాలలో చక్కటి వసతులు నిర్మాణం కాబోతున్నాయి. ఇంగ్లిష్ మీడియం కూడా ప్రారంభమవుతుంది. విద్యార్థులు చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. ఈ సందర్భంగా వనపర్తి విద్యావిభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఒక్కొక్కటి చేస్తున్నం
‘తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నం. మంచినీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. సాగునీటి బాధ తీరుతున్నది. ఇంకా ఎన్నో విషయాల్లో ఆదర్శంగా ఉన్నం. విద్యలో కూడా సమూలమైన మార్పులు చేసుకున్నం. మన ఊరు -మన బడి వంటి గొప్ప పథకాన్ని సైతం వనపర్తి నుంచే ప్రారంభించడం గొప్ప విషయం. ప్రభుత్వరంగంలో విద్య కూడా చాలా పటిష్ఠంగా బలపడాలి. అప్పుడే సంక్షేమం సాధ్యం. మన పిల్లలు మంచిగ చదువుకుంటే దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సంతోషంగా బతుకుతరు. కాబట్టే రూ.10 వేల కోట్లతో మన ఊరు- మన బడికి శ్రీకారం చుట్టినం. వైద్యరంగంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టినం. అందుకే రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నం. వనపర్తితోపాటు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తం’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.