CM KCR | గతంలో గోదావరిని చూసి సంతోషపడేది తప్ప.. చుక్కా నీరు రాకపోయేదని గుర్తు చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితి మీకు తెలుసు. ఆ నాడు కరెంటు లేదు. కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో విపరీతమైన విపరీతమైన కరెంటు కోతలుండేవి. మంచినీళ్లు లేవు. కొత్తగూడెం పట్టణంలో ఆ నాడు నీళ్లు ఎట్ల వచ్చినయో.. ఇప్పుడు ఎట్ల వస్తున్నయో మీకు తెలుసు. సాగునీరు లేదు. వ్యవసాయం దండగైపోయింది. బతక వలసలుపోవాల్సిన పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. పేదల గతి ఘోరంగా ఉండేది. ముసలివారిని ఆదుకునే వారు లేరు’ అన్నారు.
‘పెన్షన్ ఇస్తే రూ.40, రూ.70, రూ.200 ఇచ్చేవారు. ఆనాడు చెట్టుకొకరు గుట్టకొకరైన తెలంగాణను ఓ దరికి తేవాలని.. ఓ పాలసీ ప్రకారం మొదట కరెంటు బాధలు తీర్చుకున్నాం. మంచినీళ్ల బాధ లేదు. కరెంటు అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదు. యాదాద్రి పవర్ స్టేషన్ పూర్తయితే 4వేల విద్యుత్శ్చక్తి వస్తుంది. కొత్తగూడెం జిల్లానే సమైక్య రాష్ట్రం ఎవరూ చేయకపోదురు. స్వరాష్ట్రంలో జిల్లాకావడంతో పాటు మెడికల్ కాలేజీ వచ్చింది. ఏ చిన్న జబ్బు వచ్చినా ఖమ్మం, హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడే బ్రహ్మాండమైన ఆసుపత్రి వచ్చింది. 60-70 మంది వైద్యులున్నారు. అందరికీ మంచి వైద్యం అందుతున్నది. గతంలో కిడ్నీ బీమార్ ఉంటే.. డయాలసిస్ సెంటర్ లేదు. ఇప్పుడు కొత్తగూడెంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. పేషెంట్లకు సైతం పెన్షన్ ఇస్తున్నాం’ అంటూ గుర్తు చేశారు.
‘గిరిజనులకు పంచాల్సిన పొడు భూములను కొత్తగూడెం జిల్లాలో 16,769 ఎకరాల భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. 4,500 కుటుంబాలకు లబ్ధి జరిగింది. పట్టాలు ఇవ్వడంతో పాటు కేసులను ఎత్తివేయడంతో పాటు రైతుబంధు అమలు చేయడంతో పాటు బీమా ఇస్తున్నాం. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కాని పని. ఆ రోజు బోరు వేస్తే 800-600 ఫీట్లు వేసినా నీరు లేదు. కానీ ఈ రోజు భారతదేశంలో భూగర్భ జలాలు అడుగంటుతుంటే.. తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు పైకి వచ్చాయ్. ఇది మన లెక్క కాదు.. కేంద్రం లెక్క. 739 టీఎంసీల భూగర్భ జలాలు రీఛార్జి జరిగి భూమిలో ఉన్నాయి. రెండు నాగార్జున సాగర్లకు సమానమైన నీరు తెలంగాణ భూమిలో ఉన్నది. గతంలో గోదావరిని చూసి సంతోషపడేది తప్పా.. చారెడు నీళ్లు రాకపోయేది. భద్రాచలం వెళ్లినప్పుడుల్లా గోదావరికి దండం పెట్టడం.. రూపాయి నాణెం వేయడం తప్పా నీళ్లు రాలేదు’ అని తెలిపారు.
‘ఈ రోజు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం. 70శాతం పూర్తయ్యింది. కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అందులో డౌట్ లేదు. నేను వచ్చి ఆ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తా. గతంలో కరెంటు ఏ విధంగా ఉండేది. చిన్న హోటల్ నడిపితే.. గిరాకీ రూ.1000 అయితే.. కరెంటు బిల్లు మాత్రం రూ.1500 వచ్చేది. కొత్తగూడెంలో రోడ్లన్నీ బాగు చేసుకున్నాం. సెంట్రల్ లైటింగ్ను పెట్టుకున్నాం. అప్పటికీ ఇప్పటికీ రూపురేఖలు చాలా వరకు మారిపోయాయి. మూర్రేడువాగు పట్టణంలోని కొన్ని ప్రాంతాలను ముంచివేస్తున్నది. శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరారు. రూ.30-40కోట్లు మంజూరు చేశాం. పనులు పూర్తయితే ముంపు సమస్య నుంచి బయటపడుతాం. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం’ అన్నారు.