CM KCR | సీతారామ ప్రాజెక్టు గుండెకాయలాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సీతారామ ప్రాజెక్టు నా గుండకాయలాంటి ప్రాజెక్టు. సీతారామ పనులు 70శాతం పూర్తయ్యాయి. మిగతావి కాబోతున్నాయి. మీ అందరూ ఆశీర్వదిస్తే ఏడాదిన్నరలో నేను వచ్చి కొబ్బరికాయ కొట్టి స్విచ్ఛాన్ చేస్తాను. సాగర్ కాలువ నుంచి నీటి విడుదల కోసం ఎన్నిసార్లు బతిలాడాలి. ఇప్పుడు కూడా వెంకటవీరయ్య ఇంకోసారి నీళ్లు రావాలని అంటున్నడు. ఇంకోతడి ఇస్తే గడ్డకు పడిపోతమని చెబుతున్నడు. ఈ తండ్లాట ఎన్ని రోజులు. కృష్ణతో ఎప్పటికైనా మోసమే.. ఎందుకుంటే మూడునాలుగు రాష్ట్రాల పంచాయితీ. మనకు నీళ్లు తక్కువ. సీతారామ ప్రాజెక్టు పాత ఖమ్మం జిల్లా వరప్రధాయిని కాబోతున్నది. ప్రాజెక్టు పూర్తయితే నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరందుతుంది’ అని తెలిపారు.
‘పాలేరుకు వచ్చే సీతారామ కాలువను హెలీకాప్టర్ నుంచి నామా నాగేశ్వరరావుకు చూపించాను. కొద్దిరోజుల్లోనే అయిపోతది.. కాలువ వచ్చి పాలేరులో పడితే నా ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందని చెబుతున్నా. ఖమ్మానికి కరువనేదే రాదు. మూడు పంటలు పండించి.. నా రైతులు దర్జాగా కాలుమీద కాలువేసికొని కూర్చుంటారు. పడిగాపులు పడే దుస్థితి ఉండదు. రైతుబంధు, కరెంటు, దళితబంధు కావాలా.. ? కరకట ధమనకులు కావాల్నా..! సుందోపసుందులు కావాల్నా? నేను నిన్ను అసెంబ్లీకి పోనివ్వా? నిన్ను పార్లమెంట్కు పోనివ్వా? అని నాలుగు రూపాయల గర్వంతో జబ్బులు చరుకునే నీచులు కావాల్నా? పని చేసే పార్టీ కావాలా? ఆలోచించాల్సింది మీరు. గోల్మాల్ కావొద్దు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ మన సొంత విచక్షణ మీదుండాలి. సత్తుపల్లిలో నేడు ఒక మాటచెబుతున్నా.. కేసీఆర్ చెప్పిండంటే జరుగుతుంది. శిలాక్షరం. ఏ దళితబంధు అయితే పెట్టినమో.. వందశాతం ఎన్నికల తెల్లారి నుంచే అమలవుతుంది. అమలు చేసే బాధ్యత నాది’ అని తెలిపారు.
‘దళితబంధు అమలయ్యే టైమ్లో సత్తుపల్లికి వచ్చి ఒక్కరోజంతా మీ మధ్యలో కూర్చోని.. ప్రతి కుటుంబానికి అమలుచేయించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ చిల్లరగాళ్ల మాటలు పట్టుకోవద్దు. పార్థసారథిరెడ్డి లాంటి మంచి మనిషి. అరమరికలు తెలియని వ్యక్తి. ఆయన వ్యాపారం, మెడికల్ ఫ్యాక్టరీని తప్పా వేరే పట్టించుకోరు. ఆయనను అన్నా మీరు రాజకీయాల్లోకి రావాలని పిలిచారు. ఆయన రాజ్యసభ కావాలని అడుగలేదు. ఆయనకు పిలిచి రాజ్యసభ మెంబర్గా అవకాశం ఇచ్చాం. ఆయన కూడా నాతో బాధపడుకుంట అంటున్నడు.. సార్ ఇంత ప్రేమ చేసి దళితబంధు పెడితే.. ఎన్నికల కోసం పెట్టారని బద్నాం చేస్తున్నారని బాధపడ్డారు. దళితబంధు పథకం కేసీఆర్ ఎన్నికల కోసం పుట్టించిండా? దళిత సమాజం నేను చెప్పే విషయంపై ఆలోచించాలి’ అన్నారు.
‘తెలంగాణ దళిత సమాజానికి ఈ సత్తుపల్లి నుంచి అప్పీల్ చేస్తున్నా? మీ కోసం మంచిచేసేందుకు, జాగృతం చేసేందుకు, వికాసాన్ని మనసునిండా కోరుకునేటువంటి కేసీఆర్లాంటి నాయకుడిని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నా. ఇలాంటి వాళ్లురారు. మీ గురించి ఆలోచించలే.. ఎవరూ చేయలేదు. ధైర్యం చేసి చేస్తున్నది మేము. కాబట్టి దాన్ని కొనసాగించువాలంటే బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించే ప్రక్రియ మా దళితజాతి తీసుకోవాలని కోరుతున్నా. కల్లూరు, తల్లాడ, పెనుబల్లిలో ఫోర్లైన్, సెంట్రలైట్ కావాలని అడుగుతున్నారు. గొర్రెలకాపర్లకు రెండో విడత పథకం మొదలైంది. ఆటోమెటిక్ వస్తుంది. దానికి ఇబ్బంది లేదు. మిగతా పనులన్నీ చేసి పెడుతాం. ఇవన్నీ లెక్క కాదు. నాకు వెంకటవీరయ్య దగ్గరి మనిషి. చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనంటే గౌరవం ఉంది. ఆయన గట్టిగా అడిగితే ఏ మంత్రిగానీ.. ముఖ్యమంత్రి కాదనలేని పరిస్థితి లేదు. చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. వెంకటవీరయ్యను అఖండ మెజారిటీతో గెలిపించి.. సత్తుపల్లి సత్తాచాటాలి’ అని పిలుపునిచ్చారు.