CM KCR | నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు ఎన్నేళ్లు కొట్లాడాలి.. ఎందుకు ఎట్లాడాలి ? ప్రజల ఖర్మనా? దేని కోసం కొట్లాడాలి ? నేను అందరికీ ఒక మాట ఇస్తున్నా. మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా. కృష్ణానదిలో ఈ సారి తక్కువ వచ్చాయి. కర్నాటకలో ఆపుకున్నరు. శ్రీశైలం దాకా వచ్చినయ్. సాగర్కు బొట్టు రాలే. ఉన్నదాంట్లో సర్దుతున్నాం. మంచినీళ్లకు, వ్యవసాయానికి ఇస్తున్నాం. ప్రతి సందర్భంలో ఈ బాధ ఉంటుంది. ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నది’ అన్నారు.
‘గోదావరిలో పుష్కలమైన జలాలు ఉన్నాయ్. మనం కాళేశ్వరం కట్టుకున్నాం. ఆసిఫ్నగర్ కెనాల్ ఉందో.. దాని ద్వారా తెస్తే డైరెక్టర్గా నల్లగొండ ఉదయసముద్రానికి నీళ్లు వస్తయ్. దాని నుంచి పెద్దదేవులపల్లి చెరువులోకి నీరు తీసుకురావొచ్చు. దాంతో శాశ్వతంగా సాగర్ ఆయకట్టు రైతుల బాధ తీరుతుంది. దాదాపు స్కీమ్ అంతా రెడీ అయ్యింది. బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిస్తే చేసే పనేంటంటే.. గోదావరికి లింక్ చేస్తాం. ఏ సంవత్సరంలో నీళ్లు తక్కువ వచ్చినా.. ఏ పంటకు తక్కువ నీళ్లున్నా ఆ కాలువ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లను తెచ్చుకుందాం. శాశ్వతంగా సాగర్ ఆయకట్టు రైతుల పీడవదిలిపోతుంది. ఈ పద్ధతుల్లో ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్రెడ్డి పెద్దమనిషి. ఆయన చెబుతున్నడు ప్రజలు కట్టే అమూల్యమైన పన్నుల డబ్బులను రైతుబంధు రూపంలో ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నడు అని చెబుతున్నడు. రైతుబంధుకు డబ్బులు ఇస్తే దుబారనా? ఇది కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం. వాళ్ల వైఖరి’ అంటూ విమర్శించారు.
‘పీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నడు అంటే.. కేసీఆర్ అనవసరంగా 24గంటల కరెంటు ఇస్తున్నడు.. అది వేస్ట్.. ఇవ్వకూడదు.. రైతులకు మూడు గంటలు ఇస్తే సరిపోతది రైతులకు అంటున్నడు. వాళ్ల దృక్పథం అది. కర్నాటకలో 24 గంటల కరెంటు ఇస్తామని గెలిచారు. చివరకు ఇప్పుడు ఐదుగంటల కరెంటు ఇస్తున్నరు. అక్కడో ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అనెటాయన ఉన్నడు. మొన్న మనదగ్గరికి వచ్చిండు. కేసీఆర్ నువ్వు కావాలంటే మా కర్నాటకు రా.. మా అందం చూడు ఇగ.. మేం ఐదుగంటల కరెంటు ఇస్తున్నం అంటున్నడు. ఇక్కడ 24గంటలు కరెంటు ఇస్తున్నం సన్నాసి.. నీ ఐదుగంటలకు నేనేమిరావాలి..? చెప్పేందుకు కనీసం సిగ్గుపడాలి చెప్పాను. ఈ విధంగా ఆ పార్టీ వైఖరి, దృక్పథం ఉంటది’ అన్నారు.