CM KCR | స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్ అంబేద్కర్ మాట గౌరవించి నెహ్రూ దళితుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిఉంటే.. 75ఏళ్ల తర్వాత దరిద్య్రం ఉండేదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యావత్ తెలంగాణ దళిత సమాజానికి ఈ తిరుమలగిరి నుంచి పిలుపునిస్తున్నా. జవహర్లాల్ తొలి ప్రధాని అయ్యిన నాడే దళితు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇది చరిత్ర.. కఠోరమైన సత్యం.
స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అంబేద్కర్ మాట గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే.. 75 స్వతంత్రం తర్వాత దళితులకు ఈ దరిద్య్రం ఎందుకు ఉంటుండే అని అడుగుతున్నా. తెలంగాణ వచ్చాక.. ఒక దశకు పోయిన తర్వాత ఖచ్చితంగా దళితబిడ్డల దరిద్రం పోవాలని తెచ్చిందే దళితబంధు పథకం. దళితబంధు పథకం గురించి ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ, ప్రధానమంత్రి మాట్లాడలేదు. దానికి సాక్ష్యం నాతో కొట్లాడి తిరుమలగిరి మండలాన్ని పెట్టించిందే కిశోర్. కిషోర్ బాగా హుషారున్నడు. కిశోర్ ఒక మండలం తీసుకుందాం.. తుంగతుర్తి నియోజకవర్గంలో దళితబంధు పథకం పెట్టాలి.. ఒక మండలం తీసుకుందామంటే.. ఎక్కువ మంది దళితులు ఉండే మండలాన్ని తీసుకొని పెట్టారు’ అన్నారు.
సభలో సీఎం కేసీఆర్ సామెత చెప్పి నవ్వించారు.. ‘ఒక ఊళ్లో, ఇంట్ల జల్ది జల్ది పోతా ఎగిర్తపు సుట్టం వచ్చిండట. ఇంట్లో పెద్దవ్వ ఉండి.. పోతెపోతవ్ బిడ్డ బుక్కెడు సలిబువ్వ తినిపోతవా అని అన్నదట.. ఎందుకు పెద్దవ్వ సలి అన్నం తింటా.. ఉడుకయ్యెదాక ఉంటా అన్నడ’ అన్నారు. ‘కిశోర్ ఏంటున్నడు నాతోని.. అన్నా తిరుమలగిరి మండలం ఇచ్చారు. నాకు సంతోషంగా ఉంది. అది విజయం సాధించింది. మిగతా నియోజకవర్గం మొత్తం పెడతవా? పెట్టవా అంటున్నడు. ఇది బాగా పేదరికం ఉన్న ఏరియా.. పెట్టాలని మాట్లాండిడు. నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. కిశోర్ తెచ్చిన నీళ్లు.. చేసిన సేవకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. అందరూ బిడ్డలు కలిసి గెలుపుకోసం కృషి చేయాలి. కిశోర్ పట్టుదల ఉన్న మనిషి. ఉద్యమంలో మొదటి నుంచి నాతో ఉన్నడు. పోలీసుల దెబ్బలు తిన్నడో.. జైలుకు కూడా పోయిన వ్యక్తి. పట్టుబట్టి నా ఏరియాను అభివృద్ధి చేసుకోవాలని నాతో పోరాటం చేసి అభివృద్ధి చేశాడు. కిశోర్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆ సారి గెలిపిస్తే మొత్తం తుంగతుర్తికి దళితబంధు అమలు చేస్తాం’ అన్నారు.
‘ఇప్పుడు ఇక్కడ మాట్లాడే కాంగ్రెస్ నాయకుల హయాంలో గతంలో ఎట్లుండే. దంతాలపల్లి రోడ్డు ఉండే. దానిపై పోతే దంతాలు ఇరిగే పరిస్థితి ఉండే. ఇవాళ దంతాలపల్లి రోడ్డును మంత్రి జగదీశ్రెడ్డి, కిశోర్ పట్టుపట్టి బ్రహ్మాండంగా చేయించారు. గిరిజనులు ఎల్హెచ్పీఎస్ పోరాటంలో కొట్లాడారు. ఏ ప్రభుత్వం చేయలేదు. స్వయంప్రతిపత్తి రావాలని.. మా తండాలు మా రాజ్యం అనే నినాదం కలగా ఉండొద్దని.. నిజం కావాలని.. మూడునాలుగు వేల కోయ, గూడెం, తండాలను బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నాం. మూడునాలుగువేల మంది గిరిజనబిడ్డలు వాళ్ల తండాల్లో వారే రాజ్యం చేస్తున్నారు.
తుంగతుర్తిలో 27 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. అభివృద్ధి కోసం పోడుపట్టాలు ఇచ్చి ముందుకుపోతున్నాం. ఇంతకు ముందు కడుపునొచ్చినా, కాలు నొచ్చిన సూర్యాపేట, హైదరాబాద్కు పోయేది. ఇక్కడ వంద పడకల ఆసుపత్రికి వచ్చింది. రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ కేంద్రాలను తీసుకువచ్చాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తున్నాం. ఎన్నికలు కాగానే రూ.3వేలు చేసి.. రూ.5వేల వరకు పెంచుతాం. గతంలో ఎప్పుడూ స్థూపాలు కనిపించేది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పంచాయితీలతో హత్యలు, కేసులు, గడబిడలు, గ్రామాలన్నీ వల్లకాడుల్లా ఉండేవి. ఇవాళ తుంగుర్తి బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మేషనై అద్భుతంగా తయారవుతున్నది’ అన్నారు.
‘కాంగ్రెస్ గత పదేళ్ల నుంచి అధికారం లేక అవురావుమని ఆకలితో ఉన్నది. ఛాన్స్ ఇస్తే.. గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్లు పడుతాము.. పంటికంటకుండా మింగుతామనే ఆలోచనతో ఉన్నది. నేను ఒకే మాట చెబుతున్నా. కాంగ్రెస్ పార్టీ రెండు మూడు విషయాలు చెబుతున్నది. ధరణి తీసివేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ చెబుతున్నడు. ధరణి తీసుకువచ్చింది ఎవరి కోసం ? ఏ వీఆర్వో, గిర్దావరో నీ భూమి నాకు.. నా భూమి నీకు రాసే తంటా లేదు. ధరణి ముఖ్య ఉద్దేశం రైతుల భూముల మీద ఆఫీసర్ల వద్ద, ప్రభుత్వం మీద ఉండే. ఆ అధికారాన్ని రైతులకే ఇచ్చాం. మీ బొటనవేలు పెడితే తప్ప భూమి మార్పిడి కాదు. దాన్ని ఉంచుకుంటరా.. కాపాడుకుంటారా.. పోగొట్టుకుంటర మీ ఇష్టం.
ధరణితోనే రైతుబంధు డబ్బులు వస్తున్నయ్. వరి ధాన్యం వస్తే డబ్బులు వస్తున్నయ్. ధరణి తీసివేస్తే వీఆర్వోలు, అధికారుల రాజ్యం వస్తుంది? పహాణి నఖల్ల కోసం తిరగాలా? రైతుబంధు రూ.10వేలు వచ్చేది ఉంటూ రూ.3వేలు లావో అంటారు. మళ్లీ దోపిడీ దొంగల రాజ్యం.. ధరణి ఉండి రైతులకు అధికారం ఉండాలా? ప్రజలు టాక్స్ కట్టిన డబ్బులను రైతుబంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నరి అంటున్నరు. పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నడు.. 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నడు.. మూడు గంటల కరెంటు సరిపోతది అంటున్నడు. ఇంత కిక్కిరిసన సభ కిశోర్ భారీ మెజారిటీతో గెలిచిపోయిండని అర్థమైంది. నన్ను, కిశోర్ను ఆశీర్వదించేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు’ తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు.