మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో సైతం ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.
ఆసరా పెన్షన్ల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెన్షన్ డబ్బులు ఇస్తూ ఎక్కువ మందికి కూడా పెన్షన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి చెప్పారు. సకల సౌకర్యాలతో తొర్రూర్ మున్సిపాలిటీని, డివిజన్ కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.