ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతం కావడంతో.. ‘శభాష్ అజయ్’ అంటూ సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను అభినందించారు. జాతీయ నేతలు, ముఖ్యమంత్రులకు ఎలాంటి లోటూ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అశేష జనవాహినితో సభను దిగ్విజయంగా నిర్వహించారని ప్రశంసించారు.
ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి ఫోన్ చేశారు. సభ విజయవంతం కోసం జిల్లా నేతలందరూ సమష్టిగా పనిచేశారని, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. సభకు జనం అనుకున్న సంఖ్య కంటే ఎక్కువగానే వచ్చారని, సభ నిర్వహణ తీరుపై జాతీయ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చెప్పారు. తాను హెలికాప్టర్లో వస్తూ సభ దృశ్యాలను వీక్షించానని, ఆ సమయంలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా జన సంద్రమే కన్పించిందని సీఎం పేర్కొన్నారు.
మంత్రి హరీశ్రావుకు సీఎం ప్రశంస
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్ కోసం కొద్దిరోజులుగా అవిశ్రాంతంగా శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. సభ ఏర్పాట్లు, వసతుల కల్పన, నాయకులతో చక్కగా సమన్వయం చేసి అహర్నిశలు కష్టపడిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుని సీఎం ప్రశంసించారు. తాను హెలికాఫ్టర్లో వస్తూ సభ దృశ్యాలను వీక్షించానని, కనుచూపు మేరలో జనమే కనిపించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున తరలివచ్చి ఎంతో ఓపికతో వేచి ఉండి సభను సక్సెస్ చేసి బీఆర్ఎస్ను ఆశీర్వదించిన అందరికీ అభినందనలు తెలిపారు.
నామాకు కేసీఆర్ ఫోన్
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కావడంపై పార్టీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావును సీఎం కేసీఆర్ అభినందించారు. సభ అనంతరం నామాకు కేసీఆర్ ఫోన్ చేశారు. జిల్లా నేతల సమష్టి కృషితో సభ విజయవంతం అయ్యిందని, భవిష్యత్లోనూ ఇదే విధంగా కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం ఒకసారి కలవాలని కేసీఆర్ నామాకు సూచించారు.