Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆలయ గర్భగుడిపై ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికోసం తిరుమలలో స్వర్ణ తాపడం చేయించిన సందర్భాలను.. చేయించిన వారిని సంప్రదించినట్లు పేర్కొన్నారు. తిరుమలలో ఉన్నట్లు స్వర్ణ తాపడం కావాలంటే కొంత సమయం పడుతుందని.. బంగారం కూడా ఎక్కువగానే పడుతున్నట్లు వారు చెప్పినట్లు తెలిపారు. తిరుమలలో ఉన్నట్లు యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించడానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ బంగారం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలను ఆయన కోరారు.
స్వర్ణ తాపడం చేయించడానికి దాదాపు రూ.60 నుంచి 65 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆలయ నిర్మాణం మొత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి.. ఈ ఖర్చు భరించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. కాకపోతే ఈ మహోత్తర కార్యక్రమంలో తెలంగాణ యావత్ సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కదిలివచ్చి తమకు తోచినంత విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగా లేదా.. గ్రామాల తరఫున ఎలా కావాలంటే అలా ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో నృసింహ పూజ చేసి డబ్బు రూపంలో కమిటీకి అందజేయాలని కోరారు.
స్వర్ణ తాపడం కోసం తమ కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాలు బంగారం ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధుల కూర్పు తర్వాత బంగారం కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే మేలైన బంగారం కావాలని కాబట్టి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచే మొత్తం బంగారాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత తిరుమల తరహాలో స్వర్ణ తాపడాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు.
దాతలు | విరాళం ( బంగారం ) |
సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి | ఒక కిలో 16 తులాలు |
హెటిరో గ్రూప్ సంస్థ అధినేత పార్థసారధి | 5 కిలోలు |
మంత్రి మల్లారెడ్డి | 2 కిలోలు ( కుటుంబం నుంచి ఒక కేజీ, నియోజకవర్గం నుంచి కేజీ) |
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి | 2 కేజీలు |
కావేరీ సీడ్స్ | ఒక కిలో |
దామోదర్ రావు | ఒక కిలో |
సిద్దిపేట నియోజకవర్గం | ఒక కిలో |
జియర్ పీఠం | ఒక కిలో |
ఎమ్మెల్యే వివేకానంద | ఒక కిలో |
ఎంపీ రంజిత్ రెడ్డి | ఒక కిలో |
ఎమ్మెల్సీ నవీన్ | ఒక కిలో |
ఎమ్మెల్సీ శంభీర్పూర్ రాజు | ఒక కిలో |
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ | ఒక కిలో |
ఎమ్మెల్యే మైనంపల్లి | ఒక కిలో |
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు | ఒక కిలో |
కడప జిల్లా జడ్పీటీసీ మోడెం జయమ్మ | ఒక కిలో |