నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రతిఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంలలో నిర్మిస్తున్న ఉదయ సముంద్ర ప్రాజెక్టును ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ స్వల్ప వ్యవధిలోనే నిర్మించారని గుర్తుచేశారు.
త్వరలోనే ఉదయం సముద్రం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిదిన్నర ఏండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఉదయం సముంద్రం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి రైతులకు నీళ్లందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు రైతులు సహకారమందిస్తున్నారని చెప్పారు.