హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై ప్రగతి భవన్లో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతి నిధులతో ఫోన్లలో మాట్లాడుతున్నారు. అక్కడి పరిస్థితికి అనుగుణంగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అప్పటికప్పుడే సీఎం కేసిఆర్ ఆదేశాలిచ్చారు.
అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అంచనా వేశారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉపనదుల్లో వరద పరిస్థితిని సీఎం ఆరా తీశారు. సమాచారాన్ని స్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు అంచనా వేసి తగిన సూచనలు చేశారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితిలు ఎదురైనా ఎదురోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్రావు, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్నారు.