హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది వరుసగా మూడోసారి అధికారంలకి రాబోతున్నదని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్, ఎక్సయిట్ పోల్స్కి ఎప్పుడూ తేడా ఉంటుందని, 2 కోట్ల 32 లక్షల మంది ఓట్లు వేస్తే 26 వేల మంది శాంపిల్స్ తెచ్చి తెలంగాణ మొత్తం ఇలా ఉన్నదని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ప్రజలను అయోమయంలోకి నెట్టేసి రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పైశాచిక ఆనందం పొందుతున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నారని, రేవంత్ ఇంటి వద్ద భద్రత పెరిగిందని, కొత్త సున్నాలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు ‘ఆలు లేదు, చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. ఫలితాలు రాకుండానే కాంగ్రెస్ పార్టీ పోర్టుఫోలియోల పంచాయితీలు పెట్టుకొని లేకితనాన్ని చూపిస్తున్నదని విమర్శించారు. ఈ నెల నాలుగున కేసీఆర్ క్యాబినెట్ సమావేశం ఎలా పెడతారని సోషల్ మీడియాలో రేవంత్రెడ్డి ప్రచారం చేయిస్తున్నారని, అసలు రేవంత్కు ప్రజాస్వామ్య పద్ధతులు తెలుసా? అని ప్రశ్నించారు. ఫలితాలతో నిమిత్తం లేకుండా ఏ ముఖ్యమంత్రి అయినా క్యాబినెట్ సమావేశం పెట్టాలని, పద్ధతి ప్రకారమే తర్వాత కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
కాంగ్రెస్ చిల్లర బుద్ధి
తమ ప్రభుత్వ పదవీకాలం జనవరి 16 వరకూ ఉన్నదని, ఇంతమాత్రం సోయిలేకుండా రేవంత్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి దద్దమ్మ అని, అయనకేమీ తెలియదని.. కనీసం మంత్రిగా పనిచేసిన ఉత్తమ్కుమార్రెడ్డి, సీనియర్ నేత భట్టి విక్రమార వంటి నాయకులైనా చెప్పాలి కదా? అని పేర్కొన్నారు. అవుట్ అఫ్ టర్మ్లో కాంట్రాక్టర్లకు రూ.6 వేల కోట్ల బిల్లులు ఇప్పించారని ఈసీకి కాంగ్రెస్ లేఖ రాయడాన్ని శ్రవణ్ తప్పుబట్టారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత పాలన ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుందని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధ్వర్యంలో బ్యూరోక్రసీ నడుస్తుందని తెలిపారు. ఇంతమాత్రం సోయి లేకుండా ఇలాంటి చిల్లర లేఖలు రాయడం, కాంగ్రెస్ పార్టీ చిల్లర బుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కర్ణాటక గద్దలు, ఏపీ నుంచి పచ్చపార్టీ గద్దలు, ఢిల్లీ గద్దలు తెలంగాణను కమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడున్న నాయకులకు చేతకాకనే అక్కడి వాళ్లు వస్తున్నారని మండిపడ్డారు. రెండు దఫాలుగా సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, మరోసారి ఆ అభివృద్ధి, సంక్షేమం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అది ఆదివారం ఫలితాలతో వెల్లడవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ది పేగు బంధమని, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతమంది తెలంగాణపై దండయాత్రకు వచ్చినా.. బీఆర్ఎస్దే హ్యాట్రిక్ విజయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.