హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎంవో వెల్లడించింది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.
సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి వీక్గా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.
అయితే యాదాద్రిలో నేడు జరుగుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని రెండు రోజుల క్రితమే ఆలయ ఈవో గీత తెలిపారు. కానీ తనకు అస్వస్థత కారణంగా కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.