హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వరంగల్కు రోడ్డుమార్గంలో బయల్దేరారు. వరంగల్ జిల్లా ముఖద్వారం అయినా పెంబర్తిలో సీఎం కేసీఆర్ ఆగనున్నారు. హస్త కళాఖండాలను సీఎం పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ అవుతారు. పలు అంశాలపై చర్చించనున్నారు.
ఆదివారం ఉదయం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని కేసీఆర్ పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించే అవకాశమున్నది. వరదల వల్ల ప్రజలకు జరిగిన కష్టనష్టాలను సీఎం ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.
అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లో ఉండి మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నట్టు సమాచారం. వరదల అనంతర పరిస్థితులను అంచనావేసి విద్యుత్తు, రోడ్లు, తాగునీరు, పంటలు తదితర రంగాల్లో జరిగిన నష్టాలను అంచనావేసి సహాయక చర్యల కోసం చర్యలు చేపట్టే అవకాశమున్నది. వరదల్లో అంటువ్యాధులు సోకకుండా అందే వైద్యసాయం గురించి వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశమున్నదనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.