CM KCR | కేంద్రం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలోని పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని బీఆర్ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన విధానాలపై ఎంపీలతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఎంపీలకు పలు సూచనలు చేశారు.
కేంద్రం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని తెలిపారు. తెలంగాణ హక్కులపై పార్లమెంటులో గొంతెత్తాలని సూచించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజాసమస్యలపై గళమెత్తాలని సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. బీఆర్ఎస్తో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయసభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
బీజేపీ విధానాలు దేశ సమగ్రతకు ఆటంకంగా మారాయని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని అన్నారు. ఎల్ఐసీ వాటాలను అదానీ వంటి వ్యాపారవేత్తలకు అప్పగించారని.. వాటి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతున్నాయని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడుస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని.. కేబినెట్, అసెంబ్లీ నిర్ణయాలను బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తుంది. పెట్రోల్ డిజీల్ లాంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.