హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. ఎప్పటి మాదిరిగానే రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని సూచించారు. పోడు రైతులకు కూడా ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. ఈ సీజన్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి కాగానే, ఆ రైతులకు కూడా రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంలో రుతుపవనాల ఆలస్యం, వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు తదితర అంశాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని పునరుద్ఘాటించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. ‘పైసలు పోయినా ఫర్వాలేదు, పంటలను కాపాడాలి’ అని అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిని సమీక్షించారు.
తాగు, సాగునీటికి ఇబ్బంది రావొద్దు
జూలై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి విడుదలకు కొద్దిరోజులు విరామం ఇవ్వాలని సూచించారు. జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలపై అధికారులను ఆరా తీశారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం రంగనాయకసాగర్ జలాశయంలో మూడు టీఎంసీలకుగాను 0.69 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నదని ఇంజినీర్లు తెలుపగా, రంగనాయకసాగర్కు రెండు టీఎంసీల నీటిని మిడ్ మానేరు జలాశయం నుంచి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా రంగనాయకసాగర్ జలాశయం కింద ఆయకట్టుకు వానకాలం పంటకు నీరందించేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టీఎంసీల నీటి నిల్వలు ఆగస్టు చివరి వరకు 3 తడులకు సరిపోతాయని, ఆ తర్వాత మరో మూడు తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజినీర్లు సూచించారు. దీనికోసం ఆగస్టులో 5 టీఎంసీలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాం సాగర్కు తరలించాలని సమావేశం నిర్ణయించింది. ఆగస్టులోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టీఎంసీల నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు.
66 లక్షల మంది.. రూ.7,500 కోట్ల నిధులు
‘రైతు బంధు’ పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ చర్యలను ప్రారంభించింది. కొత్త రైతుల వివరాలను సేకరించే పనిలో పడింది. సోమవారం (19వ తేదీ) వరకు జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రైతుల వివరాలను తీసుకోనున్నది. నేడో రేపో సీసీఎల్ఏ నుంచి రైతుల జాబితా వ్యవసాయ శాఖకు అందనున్నది. దీని ఆధారంగానే పెట్టుబడి పంపిణీ చేయనున్నది. ఇక ఈ సీజన్లో సుమారు 66 లక్షల మంది రైతులు రైతు బంధుకు అర్హులుగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో పెట్టుబడి సాయం కోసం రూ.7,500 వరకు నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మల్లన్నసాగర్లోకి మరో 10 టీఎంసీలు
ఈ ఏడాదే మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీలు నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయని చెప్పారు. రెండో పంట అవసరాల కోసం ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నీటిని నింపి పెట్టుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
‘పాలమూరు-రంగారెడ్డి’పై సమీక్ష
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి అవసరాలకు నీటిని మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలోకి కూడా ఎత్తిపోయాలని సూచించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వార్ధా బరాజ్ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం రూ.4,252.53 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. కేంద్ర జల సంఘంలో వార్ధా బరాజ్ ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన ప్రారంభమైనందున త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని ఈఎన్సీ కోరారు. ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సీఎం సూచించారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్రెడ్డి, సీఎం ఓఎస్డీలు శ్రీధర్రావు దేశ్పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, శంకర్ పాల్గొన్నారు.
72 వేల కోట్లకు చేరనున్న సాయం
రాష్ట్ర, దేశ వ్యవసాయరంగంలో రైతు బంధు విప్లవాత్మకమైన పథకం. రైతుకు పెట్టుబడి భారాన్ని తప్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2018లో శ్రీకారం చుట్టిన ఈ పథకం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతియేటా రూ.15వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నది. 2018 నుంచి గత సీజన్ వరకు 10 సీజన్లలో రైతుల ఖాతాల్లో రూ.65,192 కోట్ల భారీ మొత్తాన్ని జమ చేసింది. ఒక పథకం ద్వారా ఇంత భారీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం దేశం మొత్తంలో ఒక్క తెలంగాణ మాత్రమే. ప్రస్తుత వానకాలం సీజన్తో కలిపితే రైతు బంధు పంపిణీ సాయం రూ.72 వేల కోట్లకు చేరనున్నది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
రైతు బంధు పంపిణీకి ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్కు రాష్ట్ర రైతాంగం పక్షాన కృతజ్ఞతలు. దేశంలో రైతుల మేలు కోసం ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అందుకే సీజన్ మొదలైందంటే చాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతులు అడగకముందే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
– పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు