హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ర్టాన్ని పోరాడి సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధిపథాన పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయురారోగ్యాలతో ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుతూ తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ గురువారం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం నిర్వహించింది.
జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అర్చకులు, దేవాదాయ ఉద్యోగులు, బ్రాహ్మణులకు సముచిత గౌరవం లభిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొండూరి కృష్ణమాచారి, పరశురాం రవీంద్రాచార్యులు, అగ్నిహోత్రం చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.