హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. శనివారం మునుగోడు బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
కలిసికట్టుగా ముందుకు..
మిత్రులు పల్లా వెంకటరెడ్డి గారికి ఒక్కటే మాట మనవి జేస్తావున్న. పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీదాక మన ఐక్యత ఇదేవిధంగా కొనసాగాల. పేదల బతుకులు బాగుపడేదాక దేశంలోని ప్రగతిశీల శక్తులన్నింటినీ ఒకటిజేసి మన పోరాటం కొనసాగుతనే ఉండాలి. ఈ ఐక్యత మునుగోడు ఎన్నికతో ముగిసేదికాదు. భవిష్యత్తులో కూడా సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ ఇతర క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తాయి. దేశంలో ఏదైన కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికొక పద్ధతి ఉంటది. మన హక్కులు మనకి రావాల. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయింది. కృష్ణానదిలో మాకు ఎన్ని నీళ్లొస్తయో చెప్పండి, ఎన్నొస్తే గన్నే ట్రిబ్యునల్కు రిఫర్ చెయ్యండి. ఎందుకు చెయ్యడు నరేంద్ర మోదీ? ఇవాళ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిన్రు. ఎందుకు.. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నవా? సమాధానం చెప్పు బిడ్డా అమిత్ షా. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది. ఈ బొమ్మలు మస్తుగ జూసినం. నీ తాత, జేజమ్మ బొమ్మలు కూడా జూసినం మేము. కొట్లాడుడు తెలంగాణకు కొత్తగాదు. కొట్లాట మొదలు పెడితే యాందాకైన కొట్లాడుతం. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేలుస్తలేరు. మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటం. తేలినకాడ గోదావరిలో నీళ్లు తెచ్చుకున్నం. ఇక్కడ కూడా రావాలని పనులు మొదలుపెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నరని అడుగుతా ఉన్న.
నీళ్ల వాటా అడగరు..
ఇంత పెద్దపెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్రెడ్డో, ఇక్కడినుంచి ఉన్న కేంద్రమంత్రో, ఇక్కడినుంచి ఉన్న ఇంకెవడన్నా పెద్దమనిషో, ఢిల్లీకిపోయి మా నీళ్ల సంగతేంది? మా కృష్ణా జలాల వాటా సంగతేంది? మా శివన్నగూడెం ప్రాజెక్టును ఎన్నడు నింపుకోవాల? అని అడగరటగాని, రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్షాను తోలుకొని ఈడికి వస్తరట. ఎవనికిగావాలె నీ డోలు, బాజా, భజంత్రీ, నీ పెద్ద పెద్ద బొమ్మలు. మునుగోడు చైతన్యమున్న గడ్డ, ఇక్కడ ఐదుసార్లు కమ్యూనిస్టులు ఉన్నరు. రైతులు చైతన్యవంతులైనరు. నేడు డిమాండ్ చేస్తావున్న కేంద్ర హోంమంత్రిని. మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాటా ఎందుకు తేలుస్తలేరో, మీ దద్దమ్మ చేతగానితనమేందో, రేపు చెప్పాలె మునుగోడులో అని డిమాండ్ చేస్తావున్న. ఏదడిగినా జెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు 20 ప్రశ్నలు అడిగిన నేను. ఒక్కదానికి కూడా సమాధానం లేదు.
ఒక్క మంచి పనైనా జరిగిందా?
ఒక్కటే మాట ఆలోచించాల మిత్రులారా దయచేసి. ఎనిమిదేండ్లయింది బీజేపీ గవర్నమెంటొచ్చి. ఏ ఒక్క మంచిపనైనా జరిగిందా? ఎవలకి జరిగింది? మేలు జరిగితే మనకు కనపడదా? మేము లేమా దేశంలో. ఒక్కటంటే ఒక్కటి మంచిపని లేదు. లేకపోగా, జరుగుతున్నది ఏంది.. ఎయిర్పోర్టులు అమ్ముతున్నరు. విమానాలు అమ్ముతున్నరు, రైళ్లు అమ్ముతున్నరు, బ్యాంకులు అమ్ముతున్నరు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నరు, పోర్టులు అమ్ముతున్నరు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టిన్రు ఒరుసబెట్టి.
వీళ్లందరి నోరుగొట్టి.. బడా షావుకార్లకు ఇయ్యాల్నా?
దయచేసి రైతు సోదరులు మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో క్రమం తప్పకుండ ఒక లక్షా ఒక వెయ్యిమందికి రైతుబంధు పథకం వస్తావుంది. ఇవాళ దీన్ని బందు పెట్టాలె. జగదీశ్వర్రెడ్డి, నేను, ఎమ్మెల్యేలంత పోయి పెద్ద లొల్లిబెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేసినం. వడ్లు కొనం.. మీ వరి కొనం. మై క్యాకర్నా అంటడు. మరి మై క్యాకర్నా. ఇంతపెద్ద దేశాన్ని నడిపి, ఎఫ్సీఐని నీ చేతిలో పెట్టుకొని, విలేకరులు లేరుగదా అని చూసి, తలుపుపెట్టి, ఎందుకయ్యా మీరు పైసలన్ని బర్బాద్ చేస్తున్నరు? రైతులకు పంచిపెడుతున్నరు, ఎవడియ్యమన్నడు మిమ్మల్ని పెన్షన్లు రెండు వేలు ఎందుకిస్తన్రు? వికలాంగులకు మూడు వేలు ఎందుకిస్తన్రు మీ రాష్ట్రంలో. మరి ఏమి చేయాలె. వీళ్లందరి నోరుగొట్టి తీస్కపోయి బడాబడా శావుకార్లకు ఇయ్యాలె. ఇవాళ దేశంలో ఇదే జరుగుతా ఉంది. రైతుబీమా అని చెప్పిన.. ఇది పనికిరాదట. ఇది బందు పెట్టాలంటరు. మునుగోడులో జరిగేది ఉపఎన్నిక కాదు.. మన జీవితాల ఎన్నిక. మన బతుకుదెరువు ఎన్నిక. మీరు ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలే. మనదాంట్లో కూడా కొంతమంది సన్నాసులుంటరు. ఇంత మందు పెట్టి, దూది పెట్టగానే దానెంబడపోతా ఉంటరు. దానికి ఆశపడొద్దు. దయచేసి ప్రలోభాలకు పోవద్దు. నేను మళ్లీ వస్తాను. చండూరు దగ్గర సభ పెట్టుకుందాం.