CM KCR | ధర్మం పేరిట బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిజాబ్పై దేశం మొత్తం మౌనం వహిస్తోందని, కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం గతేంటని ప్రశ్నించారు. ధర్మం పేరిట అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా?.. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని మండిపడ్డారు. ధర్మం పేరిట విద్వేష రాజకీయం మానుకోవాలని సూచించారు. దేశం యువతదని, విద్వేష రాజకీయాలపై యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు.
శాంతి లేని చోట ఎవరు పెట్టుబడులు పెట్టరని, శాంతిభద్రతలు కోరుకుందామా?.. ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అని ప్రజలను ప్రశ్నించారు. దేశంలో ఎన్నో లక్షల ఆలయాలు ఉన్నాయని, ఎవరు పూజలు చేయరు.. ధర్మం పేరిట మీరు చేసే ఆరాచకాలెన్ని? అంటూ ధ్వజమెత్తారు. రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలను అర్బన్ నక్సలైట్లతో పోల్చారని, ఇదెక్కడి ప్రవృత్తి అంటూ మండిపడ్డారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, సరిగ్గా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పినట్టు గుర్తుచేశారు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం బీజేపీ హయాంలో పెరిగిందన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని.. ఒకరినొకరు గౌరవించాలని సీఎం కేసీఆర్ అన్నారు.