CM KCR | ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మోతె వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేకిన్ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్.
జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్. కరీంనగర్ సర్కస్గ్రౌండ్ చైనా బజార్. ఇదేనా మేకిన్ ఇండియా. మేకిన్ ఇండియా బజార్ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అన్నారు.
‘భారతదేశ భవిష్యత్, దేశం బాగు కోసం, ఈ దేశంలో ఉన్న నదులు భూమి మీదకు వచ్చిందో.. తెలంగాణ ఎలా పచ్చపడ్డదో దేశమంతా బాగుపడే పద్ధతులు రావాలే. కడుపునిండా కరెంటు రావాలే. ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు రాదు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల తర్వాత కడుపునిండా నీళ్లు రావు. కరెంటు కోతలు తప్పడం లేదు. ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది ? స్వతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, సమరయోధులు త్యాగాలు చేసింది ఇందుకేనా? ఈ దేశం మారాలి. ఒక్క తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీడీపీ 5లక్షల నుంచి 11.50లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ పని చేసిన మందం కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే మన జీఎస్డీపీ 11.50లక్షల కోట్లు కాదు.. 14.50లక్షల కోట్లుండేది.
కేంద్రం దద్దమ్మ చేతగాని తనం వల్ల తెలంగాణ రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత మేధావులను అడిగితే వాస్తవ విషయాలు తెలుస్తాయి. అప్రమత్తంగా లేకపోతే.. ఒక ఒరవడి, ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్లీ ఆగమై పోతాం. ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక్క చిన్న పొరపాటు వల్ల 60 సంవత్సరాలు గోసపడ్డాం. ఎంత మంది చనిపోయారు ? ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? ఎన్నిచోట్ల తిరగాల్సి వచ్చింది? ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది? ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది? ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది? మన ఉద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? ఒక్క చిన్న పొరపాటుకు 60 సంవత్సరాలు గోసపడ్డ జాతి మనది. ఈ రోజు కూడా డంబాచారం, గోల్మాల్ గోవిందం గాళ్లను నమ్మితే కిందామీద ఆగమైపోతం’ అన్నారు.