CM KCR | పైన పటారం.. లోన లొటారం.. చెప్పేదంతా డంబాచారం అంటూ మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ ఎంవీఎస్ కాలేజీ బహిరంగ సభలో తెలంగాణ పట్ల కేంద్రం, ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్ తూర్పారబట్టారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు బడ్జెట్ రూ.62వేలకోట్లు. ఇవాళ బడ్జెట్ రూ.2.50లక్షల కోట్లు. జీఎస్డీపీ ఇవాళ రూ.11.50లక్షల కోట్లు ఉన్నది. కష్టపడి, అవినీతి రహితంగా, క్రమశిక్షణతో రాత్రింభవళ్లు పని చేస్తే ఇది సాధ్యమవుతుంది. డైలాగ్లు చెప్తే కాదు. అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజావిశ్వాసంతో అధికారులు, శాసనసభ్యులు, మంత్రులందరు పని చేసే ఈ రకమైన ఫలితాలు సాధించగలిగాం. విద్యార్థులు, మేధావులు, యువకులు ఆలోచన చేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘మనతో పాటే కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్కు వచ్చింది. తెలంగాణ పని చేసిన మందం.. తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఈ పూర్తిపని ఢిల్లీ గవర్నమెంట్ చేసి ఉంటే మన జీఎస్డీపీ 11.50లక్షల కాదు 14.50లక్షల కోట్లుండేది. తెలంగాణ ఒక చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రమే 3.50లక్షలకోట్లు నష్టపోయింది. దీనిపై ఆలోచన చేయాలి. మనం తిప్పలు పడితే కాదు.. మనతో సరిసమానంగా కేంద్రం పని చేస్తేనే ఈ దేశం అన్నిరకాలు బాగుపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు, సహకారం లేదు. ఆ నాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న ప్రధాని మోదీ సభలు పెట్టి పాలమూరు హమ్ బనాయింగే అంటే హమ్ బనాయింగే అని చెప్పారు. క్యో నై ఆయా..? పైన పటారం.. లోన లొటారం. చెప్పేది డంబాచారం. దండం పెట్టిన, కడుపులో తలపెట్టిన. 150 దరఖాస్తులు ఇచ్చినా. పాలమూరు కరువు జిల్లా. ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా. ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈ మూడు జిల్లాలు హక్కుకలిగి ఉన్న నది కృష్ణా జిల్లా’ అని చెప్పారు.
‘కృష్ణా నదిలో మా వాటా తేల్చండి. మీరే వచ్చి చెప్పారు సభలు పెట్టి. మీరు చెప్పిన మాటకు కట్టుబడైనా సరే
తెలంగాణకు వాటాకు ఎంత ఇస్తరు చెప్పమంటే.. అద్భుతమైన ప్రచారాలు చేసుకునే ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల టైం చాలదా? ఎక్కడున్నదీ ఈ దేశం. వాటాచెప్పేందుకే ఎనిమిదేళ్లయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి? నీళ్లు ఎప్పుడు రావాలి? మనుమలా.. మునిమమల్లా..? లేకపోతే రానేరాదా? ఇంట్లనే ఉండాలా భారతదేశం? మన కండ్ల ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. ఈ రోజు ఏం మాట్లాడుతున్నరు. మాకు చేత కాదు. వ్యవహరం చేయరాదు. నువ్వు చేస్తే నీకు అడ్డం పడుతమ్. నీ కాళ్లల్లో కట్టె పెడుతం.
ఇదే జరుగుతుంది కదా? ఇంకా విచిత్రమైన పద్ధతులు. ప్రజాస్వామ్యంలో, ప్రజలు స్వామికులుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్లు పని చేయాలి. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. గెలిచిన వారిని ఐదేళ్లు పని చేయనివ్వాలి. మంచో చేడో తేలుతుంది. ప్రజాకోర్టులో ప్రజలు నిర్ణయం తీసుకుంటరు. మాకు చేతకాదు. చేసేటోళ్లను చేయనివ్వం. ఎవరైతే చేస్తరో వారిని చేయనివ్వం. మా దొంగతనం బయటపడుతది. మా తెలివితక్కువ తనం బయటపడుతుంది. మా డొల్లతనం బయటుపడుతుంది.. ఇది కదా ఇవాళ ఈ దేశంలో జరిగేది. ‘మీ చెవుల నిండా వింటున్నరు. కండ్ల నిండా టీవీల్లో చూస్తున్నరు. నేను చెప్పేది చిన్న విషయం కాదు. ఆ నాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతిమాటా నిజమైంది’ అన్నారు.
‘ఈ రోజు దేశంలో ఏం జరుగుతుందో విద్యార్థులు, మేధావులు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని స్పందించాలే..స్పందించాలే. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తయ్. నాకు ఎందుకులే.. నీకు ఎందుకులే అనుకుంటే కాదు. గ్రామాలకు వెళ్లిన తర్వాత చర్చ పెట్టాలే. మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో ఈ చర్చ పెట్టాలే. ఏం జరుగుతుంది ఇవాళ దేశంలో.. మాటలేమే కోటలు దాటుతయ్.. తెలంగాణ గరీబ్ గడ్డా.. ఒకనాడు బాధపడ్డం. సొంతరాష్ట్రమైనంక నేను చెప్పాను అసెంబ్లీలో.. ఐదేళ్లలోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లానీరివ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో ఓట్లే అడుగ.. నిలవడ అని చెప్పినా. 24 గంటల కరెంటు రెండేళ్లలో ఇస్తామని చెప్పినం. ఆనాడు ప్రతిపక్ష నేత జానారెడ్డి లేచి.. రెండేళ్లలో నేను కూడా గులాబీ కండువా కప్పుకుంటానని నాతో అసెంబ్లీలో చాలెంజ్ చేసిండు.
ఇవాళ 24 గంటల కరెంటు వస్తుందా? బ్రహ్మాండంగా ఉందా? రైతులను ఎన్ని మోటార్లు పెట్టావ్ అని ఎవరైనా అడుగుతున్నారా? తెలంగాణ రైతాంగం కరువుకు, కాటకాలకు గురై, దుఃఖానికి గురై చెట్టుకొకరు గుట్టకొకరు అయినమ్. బతుకుదెరువు కోసం వలసలు పోయినమ్. వాళ్లు జర బాగుపడాలి.. జరంత ముఖాలు తెల్లబడాలి.. అప్పులు కట్టుకోవాలే.. వాల్ల సొంత పెట్టుబడి పెట్టే పథకం ఇచ్చే పథకం రైతుబంధు, బీమా, ఉచిత కరెంటు. చిల్లర రాజకీయాలు, ఓట్ల కోసమే కాదు. నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలర్ ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి. అప్పులు లేకుండా ఉంటేనే అది అసలైన బంగారు తెలంగాణ అని నమ్మి ఆ పనులు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. సంవత్సరానికి వేలకోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని ప్రభుత్వం చేస్తుంది’ అని స్పష్టం చేశారు.