CM KCR | తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్వజమెత్తారు. మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని మరోసారి గెలిపించాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. రంగారెడ్డి జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని పరిపాలన సంస్కరణలో భాగంగా మేడ్చల్ జిల్లాగా చేసుకున్నాం. మంచి కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నాం. నేను స్వయంగా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటుకాకపోతే.. పోరాటమే చేయకపోతే మేడ్చల్ జిల్లా వచ్చేది కాది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా. మేడ్చల్ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు, కార్యకర్తలు చైతన్యవంతులు. రాజకీయాలను అనునిత్యం గమనిస్తుంటారు. 20-22 ఏళ్ల కిందట ఉద్యమం ప్రారంభించిననాడు అందరూ నవ్వులాటగా చూశారు. తెలంగాణ అయ్యేదా? జరిగేదా? అని మాట్లాడారు’ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
‘ఆ రోజు వరకు దిక్కులేని స్థితిలో.. రాజకీయ భిక్షగాళ్లలాగా.. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పదవులు, పైరవీల కోసం ఎదురుచూశారు. ఈ రోజు అందరికీ గుర్తుండే ఉంటుంది. నాపై ఎంత నిందలు పెట్టారు? ఎన్ని రకాల అవహేళనలు చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్, ఇతర పార్టీల వారు నేను పోరాటం చేస్తున్నా కలిసిరాకపోగా అవహేళనలు చేశారు. వాటిని దిగమింగుకుంటూ.. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ 15ఏళ్లు పోరాటం చేశాం. దాని ఫలితం తెలంగాణ రాష్ట్రం రావడం.. వచ్చిన రాష్ట్రం ఎలా ముందుకువెళ్తుందో మీరు అందరూ గమనిస్తున్నారు. ఆ నాడు కరెంటు లేదు. మంచినీరు లేదు. సాగునీరు లేదు. ప్రజలు వలసబోయి బతుకబోయారు. పాలమూరు లాంటి జిల్లాలు సగం ఖాళీ అయ్యి.. బొంబాయికి వలసపోయాయి. చాలా హృదయ విదారకమైన దృశ్యాలు. భూధాన్పోచంపల్లిలో ఒకటే రోజు చేనేత కార్మికులు చనిపోతే.. అక్కడికి పోయి.. ఆ నాడు ఉన్న ముఖ్యమంత్రిని జోలెపట్టి అడిగినా ఒక్కరూపాయి సాయం చేయలేదు. అంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగేది’ అన్నారు.
‘తెలంగాణ ప్రజలను రెండోతరగతి ప్రజల కింద చూడబడుతూ.. చాలా అవహేళనకు గురవుతూ ఉండేవాళ్లం. వాళ్ల అహంకారానికి పరాకాష్ట. శాసనసభ సమావేశాలు జరుగుతుంటే.. ఆ నాడున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఒక్కరూపాయి ఇవ్వను ఏం చేసుకుంటరో చేసుకోండని మాట్లాడితే.. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేచి.. అలా ఎలా మాట్లాడుతారని సీఎంను ప్రశ్నించలేదు. బానిసల్లాగా పడి ఉండి.. నోర్లుమూశారు కాబట్టి అంత దుస్థితి ఉండేది. 1956లో చిన్నపొరపాటు జరిగింది. ఆ నాడు మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డా. భయంకరమైన బాధలు అనుభవించాం. మనకు మంచినీళ్లు లేని పరిస్థితి సృష్టించారు. కరెంటు కోతలతో చాలా ఇబ్బందులుపడ్డాం. ఈ నాడు మీ అందరి బలంతో మనం గెలిచిన తర్వాత తెలంగాణను అన్నిరంగాల్లో బాగు చేసుకున్నాం. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. మిషన్ భగీరథ పథకంతో దేశానికే తలమానికంగా తెలంగాణ ఉన్నది. ఆదర్శవంతమైన రాష్ట్రంగా ముందుకెళ్తున్నాం. కులమతాల పట్టింపు లేకుండా.. రైతాంగాన్ని, పట్టణాల్లోని పేదలను ఆదుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు.