TS Assembly | చంద్రబాబు పాలనలో పత్రిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘తెలుగు దేశం హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆ నాడు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. ప్రణయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే తెలంగాణ అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని రూలింగ్ ఇచ్చిన స్థాయికి దిగజారింది. ఆ రోజు కూడా మౌన ప్రేక్షకపాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వీళ్ల నోర్లు మెదలలేదు. చివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంస్కరణ ముసుగులో విద్యుత్ చార్జీలను పెంచారు. ఒక సంవత్సరం కాదు.. మూడు సంవత్సరాలు 15శాతం పెరుగుతుందని చెబితే ఆ సమయంలో అప్పటికప్పుడే తాను డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో లేఖ రాశాను’ అని కేసీఆర్ గుర్తు చేశారు.
‘ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్బాగ్లో నిరసన తెలిపేందుకు వస్తే పట్టపగలు ముగ్గురు కాల్పులు జరిపారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. చనిపోయిన వారు సైతం కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఓ మొఖదొరికిందని అందులోకి చొరబడి.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. అంతకు మించి ఏమీ చేయలేదు. ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో న్యాయం జరుగదని భావించి.. తాను కొంతమంది మిత్రులను కలిసి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు.. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకరు బయలుదేరాలి.. జై తెలంగాణ అనాలే.. పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తెలంగాణ దుకాణం బంద్ చేయాలి. ఇది ఎట్లా తయారయ్యిందంటే.. ఉద్యమం అంటే నమ్మని పరిస్థితి వచ్చింది. వీళ్లు ఎక్కడ చేస్తరు ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఉద్యమాలు చేపట్టి విరమించింది కాంగ్రెస్ నాయకులే’నని విమర్శించారు.
‘ఐదారునెలలు సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమధనం చేసి ఎట్లా తెలంగాణ రావాలి. ఉద్యమం చేద్దామంటే ఎవరూ సహకరించే పరిస్థితి లేదు. అంతా కారు చీకటి అలుముకొని ఉంది. ఐదారు మాసాలు ఉద్యమ పంథా నిర్ణయించుకొని చివరకు 2001 ఏప్రిల్, 27న స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారు ఇంట్లో ఆశ్రయం ఇస్తే.. జెండా ఎగుర వేసి తెలంగాణ పై తెలంగాణ ప్రస్థానాన్ని ప్రారంభించాం. చాలా నిరాశ, నిస్పృహ ఉండేది. ఇంకెక్కడి తెలంగాణ ? ఎక్కడి నుంచి వస్తుంది ? జరిగే పనేనా ? అని నిరాశలో మాట్లాడే వారు. నమ్మకం కలిగించేలా.. అవిశ్వాసం నుంచి ప్రజలు, యువకులను మేలుకొల్పేందుకు నేను పాట రాశాను. ‘సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే దేశానికి స్వాత్రంత్యం వచ్చేదా?.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని’ నేను పాట రాశాను. అదే పద్ధతిలో రాజీలేని పోరాటం చేశాం. ఎక్కడ వెనక్కి పోలేదు. పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశారు. హింసకు సైతం గురి చేశారు. ఎక్కడా వెనుదిరుగగుండా పోరాటం చేశాం. తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తెలంగాణ వచ్చింది’ అన్నారు.