CM KCR | రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నరు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతున్నడు. కేసీఆర్కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ దుబారా చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు వేస్టా? రైతుబంధు ఉండాలంటే ఆదిలాబాద్లో జోగు రామన్న గెలవాలి. ఎకరానికి రూ.10వేలు వచ్చే రైతుబంధు రూ.16వేలు అవుతుంది’ అన్నారు.
‘పీసీసీ అధ్యక్షుడు 24గంటల కరెంటు కూడా వేస్ట్ అంటున్నడు. మూడు గంటలు ఇస్తే సరిపోతుంది అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలంటే జోగురామన్ననే గెలవాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో హైదరాబాద్లో ఆ ప్రభుత్వం వస్తుంది. మరి ఓటు ఇంకొకలకు వేసి పని ఇంకొగొలను చేయమంటే చేయరు. ఓటు వేరేవారికి వేసి జోగురామన్నను పని చేయమంటే ఎట్ల చేస్తడు? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే నడుస్తది. మనపరంగా ఎవరైతే ఉండి యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలోనే కత్తిపెడితే కథ నడుస్తుంది’ అన్నారు.
‘మేం రైతుల భూములు కిందిమీద కావొద్దని.. ఒకరిపై మీదున్న భూమి ఇంకొకరి పేరుమీదకు మారొద్దని.. పైరవీకారులు, దళారీలు, లంచగొండి ఆఫీసర్లు మార్చొద్దని ధరణిని తీసుకువచ్చాం. ధరణితో మీకు చాలా అధికారం వచ్చింది. ఇంతకుముందు ఎంతో మంది అధికారుల చేతిలో బతుకు ఉండేది. వీఆర్వో, గిర్దావర్, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఎంతో మంది చేతిలో ఉండేది. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు అప్పగించింది. మీ బొటనవేలు పెడితే మీ భూ యాజమాన్యం మారుతుంది. మీ బొటనవేలు మారుతుంది. లేకపోతే మీ భూమిని మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడా లేదు. మరి ఆ అధికారాన్ని ఉంచుకుంటరా ? పోగొట్టుకుంటరా ? ఆలోచించాలి’ అని సూచించారు.
‘ఢిల్లీ నుంచి వచ్చి రాహుల్ గాంధీ చెబుతున్నడు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నారు. ధరణితో మీ భూములు సేఫ్గా ఉంటున్నయ్. రిజిస్ట్రేషన్ పది నిమిషాల్లో అయిపోతున్నది. మునుపు మ్యుటేషన్ కావాలంటే లంచాలు పెట్టి ఆరు నెలలు, ఏడాది తిరిగేది. ఈ రోజు ఆ బాధ లేదు. ధరణి ఉంది కాబట్టి రైతుల అకౌంట్లు ప్రభుత్వం ఉన్నయ్. హైదరాబాద్లో రైతుబంధు పైసలు వేస్తే మీ ఫోన్లు టింగుటింగుమని మోగుతున్నయ్. మీరు పెట్టుబడి కోసం వాడుకుంటున్నరు. మీ కడుపులో చల్లకదలకుండా, ఏ ఆఫీసుకు పోకుండా.. దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా రైతుబంధు, రైతుబీమా డబ్బులు వస్తున్నయ్. పంటల డబ్బులు కూడా వస్తున్నయ్. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా వస్తుంది. ఇది చాలా ప్రమాదం’ అని హెచ్చరించారు.