పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు కొనసాగిస్తున్నారు. తనదైన స్టైల్లో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. మంగళవారం కూడా చెన్నూర్, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొన్నారు. చివరగా పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్గాంధీపై విమర్శలు గుప్పించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తమంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
‘రాహుల్గాంధీ ధరణిని తీస్కపొయ్ బంగాళాఖాతంలో వేస్తం అంటున్నడు. రాహుల్గాంధీకి ఎద్దు ఎరుకనో..! ఎవుసం ఎరుకనో..! ఎన్నడన్నా దున్నిండో..! నేనైతే కాపుని, నాకైతే ఎవుసం ఉంది. మరి రాహుల్గాంధీకి ఎవుసం ఉందో లేదో నాకైతే తెల్వదు. కానీ ఆయన ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని మాట్లడతడు. దీనిపై రైతులు సీరియస్గా ఆలోచన చేయాలి. వాళ్లు కుళ్లా చెప్తున్నరు. ధరణిని తీసేసేందుకు గొడ్డలి భుజాన పెట్టుకుని రెడీగా ఉన్నరు. మరి ధరిణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది..? వడ్లమ్మిన పైసలు ఎట్లొస్తయ్..? రైతు చనిపోతే రైతు బీమా ఎట్లొస్తది..? మళ్లీ ఎమ్మార్వో ఆఫీసు, పహానీ నకల్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం అనుకుంట తిరగాలె. ఎన్నెకరాలు ఉందంటరు..? ఎంతొస్తదంటరు..? రూ.80 వేలు వస్తయంటే నాకు ఓ రూ.30 వేలు ఇయ్యి సంతకం పెడుతం అంటరు. అంతేనా.. కాదా..? అంటే మళ్ల దళారీ రాజ్యం వస్తది. అందుకే ఇయ్యన్నీ ఆలోచించి ఓటేయాలె’ అని సీఎం కేసీఆర్ కోరారు.
‘ఎవరికిపడితే వాళ్లకు ఓటేయొద్దు. ఆగం కావద్దు. ధరణిని తీసేస్తే మళ్లీ పాత రోజులే వస్తయ్. దళారీ రాజ్యమే అయితది. రిజిస్ట్రేషన్ల కోసం నానా తిప్పలు అయితయ్. వెనుకటి లెక్కనే మీ భూమి మీద ప్రభుత్వంలో ఉన్న అధికారులకు పెత్తనం వస్తది. వాళ్లు తల్చుకుంటే ఎవరి భూమిని ఎవరి పేరు మీదకైనా మార్చే పరిస్థితులు మళ్లీ వస్తయ్. కానీ ధరిణి ఉంటే.. ముఖ్యమంత్రి కూడా మీ భూమిని ఇంకొకరి పేరు మీదకు మార్చలేడు. మరి కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేయాలనుడు కరెక్టేనా..? దీనిపై మీరు గ్రామాల్లో చర్చ పెట్టాలె. రాహుల్గాంధీ కూడా ధరణిని తీసేయాలంటున్నడు ఎట్ల కథ అని ఆలోచన చేయాలె. కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతదనేది మీ ఊర్లళ్ల తెల్వనోళ్లకు మీరే అర్థమైతట్లు చెప్పాలె. ప్రజల మేలు కోరే పార్టీకే ఓటేయాలి. అప్పుడు మీ బతుకులు బాగుంటయ్. రాష్ట్రం ఇంకింత బాగుపడుతది’ అని కేసీఆర్ అన్నారు.