హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యానిస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర అప్పుల మొత్తం రూ. 2 లక్షల 25 వేల 450 కోట్లు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75 వేల 577 కోట్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1 లక్షా 49 వేల 873 కోట్లు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించిందని కేసీఆర్ తెలిపారు.
జీఎస్డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే.. దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తగదని కేసీఆర్ అన్నారు.