CM KCR | సూర్యాపేట : తెలంగాణలో వ్యవసాయ బావుల వద్ద, బోర్ల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టనందుకే రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కట్ చేశామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభలో కేసీఆర్ పాల్గొని, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
బీజేపీకి ఓటేస్తే మోరిలో పారేసినట్టే. అందుకే సప్పుడు చేయకుండా జగదీశ్ రెడ్డికి ఓటేయండి. తెలంగాణ సంగతి మాకు ఎరుక. పండేటోనికి ఎరుక గూనివాటం అన్నట్టు మాకు ఎరుక కదా ఇక్కడ ఏమున్నది.. ఏం లేదని. మేం రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మోదీ అంటడు.. ప్రతి బావికి, మోటార్కు మీటర్ పెట్టాలని. నేను సచ్చినా సరే మీటర్ పెట్టను అని చెప్పిన. మేం ఇప్పుడిప్పుడు బాగు పడుతున్నాం పెట్టా అని చెప్పాను. ఏం చేసిండ్రు తెలుసా.. మనకు వచ్చే రూ. 25 వేల కోట్లు కట్ చేసిండ్రు. ఇవాళ నిర్మలా సీతారామన్ చెప్పిండ్రు సిగ్గు లేకుండా హైదరాబాద్లో. అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టాయి. తెలంగాణ పెట్టలేదు.. అందుకే రూ. 25 వేల కోట్లు కట్ చేసి నోట్లో మన్నుపోశాం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు పెట్టింది. 100 ఉత్తరాలు రాశాను.. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. మోదీ చట్టాన్ని ఉల్లంఘించారు. మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. అందుకే బీజేపీకి వేసే ఓటు మోరిలో పారేసినట్టే.. అదే జగదీశ్ రెడ్డికి ఓటు వేస్తే మెజార్టీ పెరుగుతది. పనులు బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంటది అని కేసీఆర్ పేర్కొన్నారు.