CM KCR | నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
నల్లగొండ పట్టణంలో మేధావులు, చదువుకున్న వాళ్లు, ఉద్యోగస్తులు ఉంటారు. మీ అందర్నీ కోరుతున్నా. నల్లగొండ పట్టణం ఇవాళ నగరం రూపు కనబడుతోంది. బ్రహ్మాండమైన డెవలప్ కనబడుతుంది. రూపాయికే కనెక్షన్ ఇచ్చి నల్లా నీళ్లు ఇస్తున్నాం. ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. ఈ జరిగే అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మీరు జారవిడుచుకోవద్దు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు. వాళ్ల డబ్బు అహంకారంతోని ఇంతకు ముందే నాకు నకిరేకల్లో చెబుతున్నారు. నకిరేకల్లో మేం గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్ దాకా అందర్నీ పండవెట్టి తొక్కుతం అని మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి. ఈ పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు..? వీళ్లేనా మనకు కావాల్సింది. భూపాల్ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆయన. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయన హైదరాబాద్ పోయి ఉండలే. నల్లగొండలో అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు కూడా మార్చలేదు. ఇవాళ ఎమ్మెల్యే ఉన్న అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు మార్చలేదు. ప్రజల మధ్యలో ఉండి, పొద్దున్నే లేస్తే మీ మధ్యలో తిరిగేటోళ్లు కావాల్నా..? గెలిచిన తెల్లారే హైదరాబాద్లో పడేటోళ్లు కావాల్నా..? దయచేసి ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు.
ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు నల్లగొండకు వస్తున్నాయి. మళ్ల నేను మీకు మాట ఇస్తున్నా. నల్లగొండ నియోజకవర్గం ఇంకా నా దత్తతలోనే ఉన్నది. నా డ్యూటీ, భూపాల్ రెడ్డి డ్యూటీ అయిపోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న దాని కంటే ఎన్నో రేట్లు అభివృద్ధి జరుగుతది. మేం రెండు మూడు విషయాల మీద కాన్సెంట్రేషన్ చేయబోతున్నాం. మేం ఏదన్న చేస్తే గట్టి చేస్తం. ఇప్పటి దాకా సంక్షేమం చేసినం. రైతులను ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో వైద్యం కూడా స్థిరపడుతున్నది. హాస్పిటళ్లు కూడా బాగు అవుతన్నయి. ఇండ్లు లేని ప్రజలు ఎవరు అయితే ఉన్నారో.. ప్రాజెక్టులాగా ఒక టాస్క్లాగా తీసుకొని, పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని మనవి చేస్తున్నాను. అన్ని వర్గాలను ఆదుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
నల్లగొండ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. దీన్ని ఇదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నల్లగొండ వాసుల మీద ఉన్నది. ఏదో కల్లబొల్లి మాటలు నమ్మి గందరగోళమైతే నష్టపోయేది మీరే.. నా దత్తత ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా పని చేసే బాకీ ఉన్నది. తప్పకుండా మీ అభివృద్ధి కోసం భూపాల్ రెడ్డి, నేను కలిసి కష్టపడి పని చేస్తాం. మీరు ఊహించనంత అభివృద్ధి కూడా చేసి చూపెడుతాం అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.