CM KCR | సూర్యాపేట : నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పండవెట్టి తొక్కుతాం అన్నోళ్లేనా నల్లగొండ శాసకులు..? ఎంతకాలం వీళ్ల రాజ్యం సాగుతది..? అని కేసీఆర్ నిలదీశారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మోరిల నీళ్లు తాగునీరుగా ఇచ్చారు. దశాబ్దాల తరబడి మీకు అవే మూసీ మురికి నీళ్లు ఇచ్చారు. ఇదే జిల్లాలో మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగించి, లక్షా 50 వేల మంది బతుకులను కరాబ్ చేశారు ఈ కాంగ్రెస్ నాయకులు. నా కంటే దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు. మరి ఎందకు చేయలేదు వారు. ఎందుకు ఆలోచించలేదు. కనీసం మంచినీళ్లు ఎందకు ఇవ్వలేదు. ఇవాళ బ్రహ్మాండంగా పాలేరు నుంచి పాలలాంటి నీళ్లు వస్తున్నాయి. నాగార్జున సాగర్ కింద టేయిల్ పాండ్ నుంచి మంచినీళ్లు వస్తున్నాయి. ఈ మంచినీళ్లు కూడా ఇయ్య చేతకాని కాంగ్రెస్ నాయకులు అడ్డం పొడవు మాట్లాడుతున్నారు. చాలా అహకంరాతో మాట్లాడుతున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. నేను నకిరేకల్ పోతే అక్కడ చెప్తున్నారు. మేం గెలిచిన తెల్లారి బిడ్డా.. మిమ్మల్ని రోడ్డు మీద పండవెట్టి తొక్కుతాం అని మాట్లాడుతున్నారు. ఈ అహంకార నాయకులు, ఈ డబ్బు మదం ఉన్నోళ్లు వీళ్లేనా.. నల్లగొండ నాయకులు..? ఇది ఎర్ర జెండాలు ఎగిరిన గడ్డ.. కమ్యూనిస్టు ఉద్యమాలు నడిచిన గడ్డ. భీంరెడ్డి నర్సింహారెడ్డి లాంటి మహానీయులు పని చేసిన గడ్డ. ఈ గడ్డ మీద ఈ దుర్మార్గుల ఆగడాలు ఏంది..? వీళ్లు ఎంతవరకు చేస్తరు..? ఎంతకాలం వీళ్ల రాజ్యం సాగుతది..? మీరు ఆలోచన చేయాలి. ఇది మీకు చాలా డేంజర్, పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటది అని కేసీఆర్ పేర్కొన్నారు.