CM KCR | జనగామ : కాంగ్రెసోళ్ల లాగా ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం.. ఒక లెక్క ప్రకారం మాట్లాడుతాం. ఒక సిస్టమ్లో పోతాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి.. ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మహత్యలు, చేనేతల ఆకలి చావులు. 1000 ఫీట్ల బోర్లు వేసుడు. ఒక్క బోరు వేస్తే పడనే పడదు. ఆ బోర్లు వేసుడుకు ఎంత మంది వచ్చుడు. ఒకడు కొబ్బరి కాయ పట్టుకొని వస్తడు. ఒకడు తాళపు చెవిల గుత్తి పట్టుకుని వస్తడు. ఒకడు తంగేడు కట్టే పట్టుకుని వస్తడు. ఒకడు జియాలజిస్ట్ అని వస్తడు. సిద్దిపేట, చేర్యాల కలిసే ఉంటాయి కాబ్టటి ఆ బాధలన్నీ నాకు ఎరుక. ఎందుకంటే నేను కాపోన్ని కాబట్టి.. నేను ఎవుసం చేస్తా కాబట్టి ఆ కథంతా తెలుసు. ఎన్ని గోసలు పడ్డాం. ఎన్ని బోర్లు వేసినం. ఎటువంటి నమూనాలు చూసినం కాంగ్రెస్ రాజ్యంలో, ఎన్ని ఏడ్పులు ఏడ్సినం. ఎన్ని బాధలు పడ్డాం మనం. గొడగొడ ఏడ్సిననాడు ఎవడ్డన్న పట్టించుకున్నడా…? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు పడ్డాం. ఎన్ని లంచాలు ఇచ్చినం. ఇవాళ వచ్చి మాటలు మాట్లాడుతారా వీళ్లు. ఎన్ని అవస్థలు. మంచినీళ్లకు బాధ. ఎండాకాలం వస్తే యుద్ధం. సర్పంచ్ల ఇండ్లు ఖాళీ. ఈ రకంగా అనేక రకాలుగా తెలంగాణను ఏడ్పించి, పీడించి, బొంబాయి పోయేటట్టు చేసి, కరువులకు గురి చేసి, అన్నం పెట్టే రైతుకు పురుగు మందు తాగేటట్టు చేసి, తెలంగాణను సర్వనాశనం చేసింది ఇదే కాంగ్రస్ కదా..? ఇవాళ వచ్చి మీకు సక్కులు, నీతులు చెప్తాం అంటే మనం ఏమన్నా పోసిగాళ్లమా..? అంతా ఈజీగా ఉంటదా..? దయచేసి ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో బీహార్ నుంచి జీఆర్ రెడ్డిని రప్పించి, ఆర్థిక శాస్త్రవేత్తలను రప్పించి, తలకాయంతా పగులగొట్టుకుని, రెండు మూడు నెలలు మదనం చేసి ఒకదారి పెట్టుకున్నాం. పేదలకు సంక్షేమం పెట్టుకున్నాం. కాంగ్రెసోళ్లు 200 పెన్షన్ ఇచ్చారు. కానీ మనం 1000 ఇచ్చాం. ఆ తర్వాత 2 వేలకు పెంచుకున్నాం. అలా ఒక లెక్క ప్రకారం మాట్లాడుతాం. ఒక సిస్టమ్లో పోతాం. ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి, ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం. కాంగ్రెస్ రాష్ట్రాల్లో పెన్షన్ 2 వేలు ఉంటే నేను ఇక్కడ్నే నేలకు ముక్కు రాస్తా. కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో పెన్షన్ 2 వేలు లేదు. మరి ఇక్కడికొచ్చి 4 వేలు ఇస్త అంటే నమ్ముదామా..? 50 ఏండ్లలో ఎన్నో వాగ్దానాలు చేశారు. ఎన్ని కథలు చేశారు. ఎన్ని సినిమాలు చూపించారు. మనం ఏమైనా హావులేగాల్లా కనబడుతున్నామా..? వాళ్లకు, వీళ్ల చరిత్ర లేదా మన దగ్గర. అంత చూసుకుంటా కూడా మళ్ల గోల్ తిప్పుదాం అంటే అంత ఈజీగా తెలంగాణ గోల్ అయితదా.. దయచేసి మీరు ఆలోచించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్లానింగ్ కమిషన్ రిపోర్టులో లేదా వేరే రాష్ట్రంలో మాట్లాడితే, ఢిల్లీలో మాట్లాడితే.. మేం పోయినప్పుడు తెలంగాణ అంటే బ్యాక్వర్డ్ ఏరియా, కరువు ప్రాంతం, మీకు వడ్లు పండవు అని లేబుల్ అంటేశారు. ఇది 50 ఏండ్ల కాంగ్రెస్ ఘనత. తెలంగాణ అంటే ఆ గతి చేసిండ్రు. వెనుకబడ్డ ప్రాంతం, పీడిత ప్రాంతం, కరువు ప్రాంతం, వడ్లు పండని ప్రాంతం అని ఓ లేబుల్ వేశారు. అది కాంగ్రెస్ గొప్పతనం. ఇవాళ పంజాబ్ను తలదన్ని నా తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా పంటలే. వరికోత మిషన్లు చాల్తలేవు. హమాలీలు సరిపోతలేరు. మన దగ్గర హమాలీలు సరిపోక బీహార్ నుంచి వస్తున్నారు. ధాన్యం తరలించేందుకు లారీలు సరిపోతలేవు. పట్టడానికి గిర్నీలు సరిపోతలేవు. రోడ్ల మీద వడ్లు ఆరబోశారు. హెలికాప్టర్లో పోతుంటే మొత్తం వడ్ల కుప్పలే కనబడుతున్నాయి. ఈ వడ్ల కుప్పలన్నీ కాంగ్రెసోని అయ్యా తెచ్చినాడా..? మనం ఎండిననాడు, ఏడ్సిననాడు, కరువుకు గురైనాడు యేడ పండిండు ఈ కాంగ్రెసోడు. రాజ్యం చేసుకుంటనే ఉన్నాదు కదా..? ఇదంత కండ్ల ముందే కనబడుతున్నంగా దీన్ని మాయమశ్చింద్ర చేస్తాం. గజకర్ణ, గోకర్ణ టక్కుటమారా విద్యలు మాట్లాడుతాం అంటే నడుస్తదా..? అంత అలకగా ఉన్నదా తెలంగాణ.. అంత యెడ్డివాళ్లమా మనం అని కేసీఆర్ మండిపడ్డారు.