హైదరాబాద్ : టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ కడిగిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
మీరు నీళ్లు ఇవ్వలేదు.. మేం ఇస్తున్నాం. మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువ ఉండే. మాకు స్కిల్స్ ఉన్నాయి. శామీర్పేట వద్ద కొత్త రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నాం. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకువస్తాం. కరెంట్ మీరు ఇవ్వలేదు. మేం ఇస్తున్నాం. ఇది ప్రజలకు తెలుసు. మీరు పదేపదే మాట్లాడి మీరే దెబ్బతింటారు. మీ హయాంలో అపర మేధావులు, ప్రపంచ మేధావి ఉండే. ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు. రోశయ్య విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు.. రెండేండ్లలో విద్యుత్ వ్యవస్థను మంచిగా చేసి ఇస్తా.. లేదంటే ఇదే శాసనసభలో ఉరేసుకుంటా అన్నారు. ఆయన గాశారం బాగాలేక అది కాలేదు. ఓసారి మధ్యాహ్నం సెషన్కు బ్రీఫ్కేస్లో తాడు తెచ్చుకున్నాడు. మేమందరం వారించి వద్దన్నాం. విద్యుత్ విషయంలో మనందరం బాధితులమే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 20 వేల కోట్లు ఖర్చు పెట్టి.. నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నాం. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్ల పవర్ స్టేషన్ ఫలితాలు అందుతాయి. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు త్వరలోనే పూర్తవుతాయి. నాణ్యమైన విద్యుత్ను ఇవ్వగలుగుతున్నాం. దీంతో పెట్టబడులు తరలివస్తున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు.