CM KCR | మంచిర్యాల : సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచేందుకు సిద్ధమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడున్న బీజేపీ సర్కార్ సింగరేణిని ప్రయివేటు పరం చేస్తాం అంటున్నారు. ఎంత ఘోరం అంటే.. గోల్ మాల్ చేస్తున్నారు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
దేశంలో బొగ్గుకు కొరత లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. 361 బిలియన్ టన్నుల బొగ్గు ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ ఈ దేశంలో ఏ జరుగుతుంది. 361 బలియన్ టన్నుల బొగ్గు నిల్వలు దేశంలో ఉన్నాక బొగ్గు గనులను, కరెంట్ను ప్రయివేటు పరం చేస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు. కరెంటు ఉద్యోగాలు పీకేస్తాం అంటారు. సింగరేణిని ప్రయివేటు వాళ్లకు అప్పజెప్తామని అంటారు. ఏం పాలసీ ఇది.. ఏం దిక్కుమాలిన పాలసీ ఇది. ఏం జరుగుతుంది ఈ దేశంలో అని కేసీఆర్ మండిపడ్డారు.
సింగరేణి బిడ్డలకు ఒక్కటే మాట విన్నవిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో దండిగా ఖనిజ నిల్వలు ఉన్నాయి. సింగరేణి ఒక వజ్రపు తునక లాంటి మైనింగ్లో బాగా కౌసల్యం సంపాదించిన సంస్థ. కాబట్టి తెలంగాణలోని మిగతా గనుల తవ్వకాలను సింగరేణికే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. సింగరేణిని మరింత విస్తృతపరిచి ఒక ఉద్యోగ వనరుగా మార్చబోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
దేశంలో 150 సంవత్సరాల వరకు సరిపడ బొగ్గు ఉన్నా, దాని వాడకుండా ఆస్త్రేలియా నుంచి ,ఇండోనేషియా నుంచి ఎందుకు దిగుమతి చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడానికే మన పార్టీ బీఆర్ఎస్గా మారింది. దేశ వ్యాప్తంగా పోరాటానిక నడుం కట్టి ముందుకు పోతున్నాం. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచేందుకు సిద్ధమవుతుంది. మోదీ మనల్ని మోసం చేశారు. సింగరేణిని మోసం చేస్తున్నారు. బొగ్గు నిల్వల గురించి ప్రజలకు తెలియాలి అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చుకుటున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా కరెంట్ ఇవ్వడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో అక్కడ కూడా పవర్ కట్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర పవర్ కట్స్ లేవు. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోని తెలంగాణలో ఇస్తున్న మాదిరిగానే దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, పరిశ్రమలకు, సాగునీటి ప్రాజెక్టులకు 150 సంవత్సరాల వరకు కరెంట్ ఇచ్చేంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. దుర్మార్గంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. దీన్ని పసిగట్టి జాగ్రత్తగా వ్యవహరించలి. ముందు ముందు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటది అని కేసీఆర్ తెలిపారు.