వికారాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదు అని కేసీఆర్ హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మళ్లీ పాత కథనే వస్తుందని సీఎం హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఈ దేశానికి ఏం చేశారని దేశ ప్రధానిని కూడా అడిగానని కేసీఆర్ తెలిపారు. రైతులకు, గిరిజనులకు, ముస్లిం మైనార్టీలు, దళితులకు ఎవరికీ మేలు జరిగింది. మేలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉచితాలు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కరెంట్ బిల్లులు వసూలు చేయాలని రైతుల మెడపై కత్తి పెట్టారు బీజేపీ నాయకులు. బీజేపీ జెండాను చూసి మోసపోతే కరెంట్ బావుల కాడ మీటర్లు పెట్టి.. శఠగోపం పెట్టి, పెద్ద షావుకార్ల కడుపులు నింపుతారు. ఆ ప్రమాదం రావాల్నా..? కరెంట్ ఫ్రీగా రావాల్నా..? మీరే ఆలోచించుకోవాలి. మరి రావాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ జెండా పట్టుకుంటే మళ్లీ పాత కథనే వస్తుంది.
ఇవాళ గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. బ్యాంకులను దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద షావుకార్లకు లక్షల కోట్ల రూపాయాలు దోచిపెట్టారు. దీనికేనా బీజేపీ జెండాలు అడ్డు తెచ్చేది. వికారాబాద్కు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు. కరెంట్ ఇవ్వలేదా? మంచినీళ్లు ఇవ్వలేదా? కలెక్టరేట్ ఇవ్వలేదా? నిధులు ఇవ్వలేదా? సంక్షేమ పథకాలు అమలు కాలేదా? ఇవన్నీ మీరు ఆలోచించాలి. గోల్ మాల్ కావొద్దు. నియోజకవర్గానికి 1000 మంది చొప్పున కర్ణాటక బోర్డర్కు తీసుకెళ్లాలని స్థానిక టీఆర్ఎస్ నాయకత్వానికి సూచిస్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో పరిశీలించండి. అక్కడ కల్యాణలక్ష్మి అమలవుతుందా? ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నారా? ఉచిత కరెంట్ ఇస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు. అనేక బాధలు పడి తెచ్చుకున్న తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోతోంది. మన తెలంగాణను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.