జగిత్యాల : భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
దండం పెట్టి మాట్లాడుతున్నా. నా వెంట నడవండి తెలంగాణ వస్తదని చెప్పాను. మీ అందరి తోడ్పాటు, ధర్మపురి నరసింహ్మా స్వామి దయ వల్ల తెలంగాణ వచ్చింది. మన చుట్టూ జరిగే దాన్ని గమనించకపోతే ప్రమాదంలో పడుతాం. గోల్ మాట్ గోవిందం గాళ్లు, కారుకూతులు కూసేవాళ్లు తిరుగుతున్నారు. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటది. చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటది. భారతదేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సంప్రదాయాలు పోవాలి.
కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో మోదీ ప్రధాని అయ్యిండు. ఒక్క మంచి పనైనా జరిగిందా? సాగు, మంచినీటి, కరెంట్ రంగంలో మంచి జరిగిందా? ఆయనకు డైలాగులు బాగా చెప్తాడు. మేకిన్ ఇండియా అంటడు. పిల్లలు కాల్చే పటాకులు, పతంగులను ఎగురవేసే మాంజా చైనా నుంచి వస్తాయా? ఇదేనా మేకిన్ ఇండియా. దీపాంతలు కూడా చైనా నుంచి వస్తాయా. భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అయితదా? ఇదేనా మేకిన్ ఇండియా. ఉన్న ఆస్తులను ఊడగొడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుండు. కరెంట్ ప్రయివేటీకరణ చేస్తాం, ముక్కు పిండి వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు.
ఉచితాలు ఇవ్వకూడదంట. కానీ ఎన్పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయాలను ప్రజల ఆస్తులను దోచి పెట్టింది బీజేపీ పార్టీ 8 సంవత్సరాల నుంచి. లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్ఐసీని అమ్మేస్తాం అంటున్నారు. కేంద్ర బడ్జెట్కు సమానంగా ఎల్ఐసీ రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా, మీ అబ్బ సొత్తులాగా, ప్రజల సొత్తును షావుకార్లకు కట్టబెడుతామంటే భారతదేశం పిడికిలి ఎత్తాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎల్ఐసీలో ఉండే ఏజెంట్ మిత్రులు పిడికిలి బిగించి సైనికులు కావాలి. మన ఆస్తులను కాపాడుకోవాలి. కరెంట్ను ఎలా ప్రయివేటికరిస్తారు. ఈ అరాచకం ఇలానే కొనసాగితే పెట్టుబడిదారుల రాజ్యం అవుతది తప్పపేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచించాలి. సబ్ కా వికాస్ అన్నారు కానీ వికాసం లేదు. అంగన్వాడీల నిధులు కోతపెట్టి బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు ఇస్తారు. ఎన్ని రోజుల ఈ మోసపు నినాదాలు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం మహిళలపై రేప్లు, దళితుల మీద దౌర్జన్యాలు జరగకుండా ఉండని రోజు ఉందా? ఈ దేశం మారాలి. లేకపోతే అన్ని రకాలుగా నష్టపోతాం. మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ.. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ దేశంలో ఏ నగరంలో అంటే అక్కడ నేను చర్చకు సిద్ధం అని చెప్పారు. 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. 10 వేల మంది పెట్టుబడిదారులు దేశాన్ని వదిలిపెట్టి పోతున్నారు. ఉన్నవి ఊసిపోతున్నాయి.. కొత్తగా వచ్చిందేమీ లేదు. దేశానికి ఏ రంగంలో ఏం జరిగిందో యువకులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. మనమంతా అప్రమత్తంగా ఉండాలి అని కేసీఆర్ సూచించారు.