వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జెండాలు పట్టుకుని నా బస్సుకే అడ్డం వస్తారా? అని మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయి. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే రాలేదు తెలంగాణ. ఇవాళ ఎవడూ పడితే వాడు అది మాట్లాడుతున్నాడు. మన బాధలు చూడనివారు మన అవస్థలు పట్టించుకోనివారు, నవ్విన వారు అడ్డం పొడవు మాట్లాడుతున్నారు. ఆనాడు ఉద్యమం జరిగినప్పుడ 14 సంవత్సరాలు పోరాటం చేశాను. చావు అంచు దాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించాను. తెచ్చే వరకు తెచ్చాను. తెచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నీ కొనసాగాలి. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ముందుకు పోవాలి. ఇంకా లాభం జరగుతంది. తాను కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమైతదని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ దేశంలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. మన రాష్ట్రం బాగుంటే సరిపోదు. వివేకంతో మనందరం ఆలోచించాలి. తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. కేంద్రంలో ఉన్నవారు మనం ఇచ్చే వాటిని ఉచితాలు అని చెప్తున్నారు. కొంతమంది చిల్లరమల్లరగాళ్లు జెండాలు పట్టుకుని నా బస్సుకు అడ్డం వచ్చారు. అడ్డం వచ్చిన ఆ ఐదారు మంది పోరగాళ్లను మనోల్లు కొడితే తుప్పుతుప్పు అవుతారు. వారు ఏం ఉద్ధరించారు. ఏం లాభం చేశారు. 8 ఏండ్ల నుంచి బీజేపీ ఒక్క మంచి పని చేసిందా? దీనిపై మీరందరూ చర్చ పెట్టాలి. రాజకీయంగా చైతన్యం లేని సమాజం లేకపోతే దోపిడికి గురవుతాం. మోసపోతే గోస పడుతాం. సమైక్య పాలకుల చేతిలో విలవిలలాడిపోయారు. పెరుగు అన్నం తినే రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోయారు. ఆ బాధలు మళ్లీ తెలంగాణకు రావొద్దంటే మనం అప్రమత్తంగా ఉండాలి. యువకులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.